నా నియోజకవర్గంలో నాకు తెలియకుండానే అభివృద్ధి పనులు చేపడతారా..?: అశ్వారావుపేట ఎమ్మెల్యే ఫైర్

by Aamani |
నా నియోజకవర్గంలో నాకు తెలియకుండానే అభివృద్ధి పనులు చేపడతారా..?:  అశ్వారావుపేట ఎమ్మెల్యే ఫైర్
X

దిశ,దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అధికారుల చర్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్మపేట మండలంలో మంగళవారం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ తో కలిసి పూసుకుంట, కట్కూరు గ్రామాల పర్యటన సాగుతుంది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం మూడు హై లెవెల్ బ్రిడ్జిలను ప్రారంభిస్తారు. తర్వాత పూసుకుంటలో ఆయిల్ ఫామ్ మొక్కలు, తేనెటీగల పెంపకం పెట్టెలను అందజేస్తారు. ఈ మేరకు సోమవారం రాత్రి ఎమ్మెల్యే జారె క్యాంపు కార్యాలయం నుండి ప్రకటన కూడా వెలువడింది. అయితే ముందుగా అనుకున్న షెడ్యూల్లో లేనివిధంగా రూ.15 కోట్ల వ్యయంతో 10 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణ పనుల శంకుస్థాపనకు ఆర్ అండ్ బి శాఖ అధికారులు శిలాఫలకంతో ప్రారంభోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ విషయం స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ కు సమాచారం ఇవ్వలేదు. తనకు తెలియకుండానే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంతో ఆర్ అండ్ బి అధికారులపై జారె తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యే ఉన్నాడనుకున్నారా.. లేదా చచ్చిపోయాడని అనుకుంటున్నారా..? ఎమ్మెల్యే పిచ్చోడిలా కనిపిస్తున్నాడా..? నా నియోజకవర్గంలో నాకు తెలియకుండానే అభివృద్ధి పనులను ఎలా ప్రారంభిస్తారని అధికారులు తీరుని తప్పుబట్టారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అంటే తనకి గౌరవం ఉందని.. కానీ అధికారుల తనని అవమానించేలా వ్యవహరించడంతో తన మనోభావం దెబ్బతిందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రారంభోత్సవంలో తాను పాల్గొననని.. పర్యటన నుండి తిరిగి వెళ్లిపోతానని ఎమ్మెల్యే జారె తెగేసి చెప్పారు. మంత్రి తుమ్మల కలుగజేసుకొని అధికారులు ఎమ్మెల్యేకి సమాచారం అందించకపోవడం అధికారుల తప్పేనని.. దీనిపై తర్వాత చర్చిద్దామని జారె ను సముదాయించారు. జారె ను మంత్రి తుమ్మల తన కారులో కూర్చోబెట్టుకుని తీసుకువెళ్లారు. దీంతో రోడ్డు నిర్మాణ పనుల శంకుస్థాపనకు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించకుండానే పర్యటన ముందుకు సాగింది. దీంతో రూ.15 కోట్ల రూపాయల రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభోత్సవానికి నోచుకోలేదు.



Next Story

Most Viewed