ప్రాణుల మనుగడకు ప్రమాదం

by Ravi |
ప్రాణుల మనుగడకు ప్రమాదం
X

సృష్టిలో మనుగడ సాగించే మానవాళికి, సకల చరాచర ప్రాణులకు ఊపిరి పోసేది ప్రాణవాయువైన ఆక్సిజన్. ఆక్సిజన్ లేని ప్రపంచాన్ని, పర్యావరణాన్ని ఊహించుకోవడం చాలా కష్టం. ప్రాణవాయువైన ఆక్సిజన్ ఉత్పత్తి చేసి, పర్యావరణ సమతుల్యతను ప్రకృతిని కాపాడేందుకు ప్రభుత్వాలు నడుం బిగించి పచ్చదనం పరిశుభ్రత, హరితహారం, వన మహోత్సవం మొదలకు పేర్లతో మొక్కలను నాటి మానవాళికి మేలు చేకూర్చేందుకు, అడవుల పెంపుదలపై చర్యలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగా ప్రభుత్వాలు పెద్ద ఎత్తున గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ భూములలో, నగరాలు, పట్టణాలు, అర్బన్ ఏరియాలలో రియల్ ఎస్టేట్ వెంచర్లలో, ప్లాట్‌లలో, ఫుట్ పాత్‌ల పక్కన, రోడ్లకు ఇరువైపులా మానవులకు ప్రాణులకు ఉపయోగపడే మొక్కలు నాటి సంరక్షిస్తున్నారు.

పక్షులు వాలని చెట్లు..

ఇందులో ఆక్సిజన్‌ను ప్రాణవాయువును ఉత్పత్తిని చేసే మొక్కలతో పాటు కోనోకార్పస్, ఏడాకుల చెట్లను కూడా వాటితో పాటు నాటగా అవి నేడు వృక్షాలుగా మారినాయి. అయితే మానవులలో సత్ప్రవర్తన, దుష్ప్రవర్తన కలిగిన వారు ఏ విధంగా ఉన్నారో మొక్కలలో, చెట్లలో కూడా పర్యావరణానికి, ప్రాణకోటికి కీడు కలిగించే ఈ రెండు రకాల చెట్లు కూడా నేడు వృక్షాలుగా మారి ఎంతో కీడు చేస్తున్నాయి. పొలంలో కలుపు మొక్కలు పైరుకు ఏ విధంగా చేటు చేస్తాయో ఈ కోనో కార్పస్, ఏడాకుల చెట్లు కూడా మానవ మనుగడకు నేడు సవాలుగా మారినాయి. అన్ని మొక్కల్లాగానే ఈ చెట్లు కూడా అందం, ఆహ్లాదాన్ని కలిగిస్తాయి అనుకుంటే ఈ రెండు చెట్ల వల్ల మంచి కంటే చెడు ఎక్కువ జరుగుతుందని ఈ మధ్య పరిశోధనల వల్ల తెలిసింది. ఈ మొక్కలు అతివేగంగా పెరిగి వాటి వేర్లు చాలా లోతు వరకు వెళ్లి, భూగర్భ జలాలను అధికంగా తీసుకుని నీటి కొరతకు కూడా కారణమవుతున్నాయి. పక్షులు వాలని, గుడ్లు కూడా పెట్టని చెట్లు ఇవే అంటే సందేహం లేదు.

నిలువెల్లా విషం!

ఈ చెట్లు శీతాకాలంలో గుత్తులు గుత్తులుగా పూతకు వచ్చి పూల వాసన నుండి వచ్చే పుప్పొడి గాలిలో కలిసి శ్వాసకోశ వ్యాధులు, క్యాన్సర్ సంబంధిత వ్యాధులు, చర్మ సంబంధిత వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. అంతేకాకుండా వీటి దుర్వాసనతో వాంతులు, తలనొప్పి, వికారాలు దద్దుర్లు మొదలగు అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని పరిశోధకులు తేల్చి చెప్పినారు. ఇట్టి ప్రమాదకరమైన కోనొ కార్పస్, ఏడాకుల చెట్లను వెంటనే తొలగించి వాటి స్థానంలో పక్షులకు, ప్రాణులకు మేలు కలిగించే పండ్ల జాతి మొక్కలను నాటితే అడవుల నుంచి వచ్చిన కోతులకు, పక్షులకు గొప్ప మేలు కలుగుతుంది. ఈ చెట్లను ఇప్పటికే పలు దేశాలతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో కూడా నిషేధించారు. మన రాష్ట్రంలో ఉన్న ఈ రెండు రకాల చెట్ల వల్ల సంభవించే దుష్పరిమానాల పట్ల ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చి సత్వరమే వీటిని తొలగించి వీటి స్థానంలో పర్యావరణానికి మేలు చేసే మొక్కలను నాటడం శ్రేయస్కరం.

పసుల స్వామి

96528 72885

Next Story

Most Viewed