మీడియా స్వేచ్ఛకు ప్రతీక అసాంజే

by Ravi |   ( Updated:2024-07-07 01:15:58.0  )
మీడియా స్వేచ్ఛకు ప్రతీక అసాంజే
X

అమెరికాలో అగ్ర రాజ్య ముసుగులో దాగివున్న నయవంచన, దుర్మార్గాలను సాధికారికంగా బయటపెట్టిన ఆస్ట్రేలియాకు చెందిన వికీలీక్స్‌ సంస్థ స్థాపకుడు, జూలియన్‌ అసాంజేపై 'గూఢచర్యం' ఆరోపణలతో పద్నాలుగు సంవత్సరాలు నిర్బంధించింది. నానా అగచాట్లకు గురి చేసింది. చివరకు ఆయన విడుదల కోసం అమెరికా ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందంలో భాగంగా తన మీద మోపబడిన నేరాన్ని అసాంజే అంగీకరించాడు. ఈ నేరానికి ఐదేండ్ల జైలు శిక్షను విధించారు. అయితే అసాంజే బ్రిటన్‌లో ఇప్పటికే అంతకంటే ఎక్కువ కాలం జైల్లో శిక్ష అనుభవించినందున శిక్షా కాలం పూర్తయినట్లు భావించి ఆయనను విడుదల చేశారు. వెంటనే ఆయన తన మాతృదేశం ఆస్ట్రేలియాకు ప్రయాణమై క్షేమంగా చేరుకున్నాడు. అసాంజే ప్రస్తావన వచ్చినప్పుడల్లా అమెరికా ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడిందా అని భావి తరాలు తెలుసుకునేందుకు ఈ ఉదంతం తోడ్పడింది.

అసాంజే చేసిన నేరం..

ఇరాక్‌‌లో అమెరికా దారుణాలను అసాంజే నేతృత్వంలోని వికీలీక్స్‌ బయటపెట్టింది. ఇరాక్‌లో అణు ఆయిధాలు, రసాయన ఆయుధాలు ఉన్నాయని తప్పుడు ఆరోపణలు చేసింది. ప్రపంచాన్ని నమ్మించింది. అన్యాయంగా సద్దాం హుస్సేన్‌ను ఉరితీసింది. అలాగే ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా దుశ్చర్యలను బయట పెట్టింది. ప్రపంచం ముందు అమెరికాను ఒక దోషిగా నిలబెట్టడమే అసాంజే చేసిన నేరం. అమెరికా లాంటి దేశంలో కట్టుదిట్టమైన రక్షణ వలయాన్ని దాటి అనేక ప్రభుత్వ రహస్య పత్రాలను, అధికారిక డాక్యుమెంట్లను సంపాదించిన సాహసోపేతమైన జర్నలిస్ట్ అసాంజే. ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుగా ప్రభుత్వ దమన నీతిని ఎండగట్టడం ఆయన వృత్తి ధర్మం. చెల్సియా మానింగ్‌ అనే అమెరికా మిలిటరీ అధికారిణి ద్వారా అస్సాంజే రహస్య పత్రాలు సేకరించారు. ఈ అంశం బయటపడిన తర్వాత ఆమె మీద ప్రభుత్వం వివిధ కేసులు మోపింది. సుమారు 35 సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా కూడా విధించారు. కానీ ఆనాటి అమెరికా అధ్యక్షుడిగా బరాక్‌ ఒబామా ఆ శిక్షాకాలాన్ని ఏడు సంవత్సరాలకు తగ్గించారు. దానితో 2017 లో ఆమె జైలు నుంచి విడుదలైంది. ఆమె అసాంజేకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యం ఇవ్వలేదు.

అమెరికా నేరచర్యను ఎండగట్టి..

జర్నలిస్టుగా ఒక ప్రభుత్వ నేరపూరిత చర్యను ప్రజలకు తెలపడం అసాంజే బాధ్యత. అందుకు తగిన సాక్ష్యాధారాలను సేకరించి ప్రపంచానికి ఇంటర్నెట్ ద్వారా వికీలీక్స్ సాధనంగా ప్రపంచానికి తెలిపారు. దానికి అమెరికా ప్రభుత్వం అతనిపై కక్ష కట్టింది. ఇప్పటికే ప్రపంచంలో అనేక మంది జర్నలిస్టులు పలు దేశాల్లో ప్రభుత్వ లోపాలను సంచలనాత్మక అంశాలుగా బయట పెట్టి ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందారు. జర్నలిస్టులు వివిధ మార్గాల్లో వారికి కావాల్సిన సమాచారం సేకరించటం వారి వృత్తి ధర్మం. వారికి సహకరించి సమాచారం ఇచ్చిన వారి వివరాలు ఎవరికీ, ఎప్పటికీ చెప్పకుండా గోప్యత పాటించడం కూడా వారి వృత్తి ధర్మంలో భాగమే.

మీడియా స్వేచ్ఛ దేశద్రోహం కాదు

అమెరికా ప్రభుత్వం ఈ కేసుతో జర్నలిజాన్ని ఒక నేరంగా మార్చింది. వార్తల సేకరణ, ప్రచురణను నేరంగా పరిగణించింది. తోటి జర్నలిస్టులు వాస్తవాన్ని గ్రహించి కేసు తీరుతెన్నులను బహిర్గత పరచాలని అసాంజే భార్య స్టెల్లా యావత్‌ విజ్ఞప్తి చేసింది. కేసు నడిచినంత కాలం భర్తకు అండగా నిలిచిన ధీరవనితగా ఆమె చరిత్రకెక్కింది. అసాంజే ఉదంతంతో పరిశోధనాత్మక జర్నలిజం ఇక ముందు కూడా ఆగదు, తమ పాలకుల దుర్మార్గాలను వెల్లడించాలని చిత్తశుద్ధితో పనిచేసే జర్నలిస్టులకు ఈ ఉదంతం ఓ ధైర్యాన్ని ఇచ్చింది. ఇక ముందు ఈ స్ఫూర్తి కొనసాగుతుంది. మీడియా స్వేచ్ఛ దేశద్రోహం కాదు. ప్రజల పక్షాన నిలవడమే జర్నలిజం వృత్తి ధర్మం. ప్రతి ఒక్క జర్నలిస్టుకూ అసాంజే ఒక రోల్ మోడల్. నియంతృత్వ ప్రభుత్వాలకు ఓ హెచ్చరిక కూడా.

కట్టుబానిసలుగా ప్రధాన మీడియా

మన దేశంలో కూడా అనేక పేరు మోసిన పత్రికలు, ప్రఖ్యాత మీడియా సంస్థలు (ఛానళ్ళు) కార్పొరేట్లు అదానీ, అంబానీ చేతుల్లోకి వెళ్ళిపోయాయి. అవి స్వలాభం కోసం అధికారంలో ఉన్న ప్రభుత్వాలకు బాకా కొడుతున్నాయి. నిజమైన ప్రజా సమస్యలను చర్చకు పెట్టడం లేదు. గత పదేళ్లుగా మన ప్రధాన మీడియా కట్టు బానిసగా కేంద్ర ప్రభుత్వానికి ఊడిగం చేసి ప్రపంచ దృష్టిలో అభాసుపాలైంది. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 'గోదీ' మీడియా చెప్పిన కల్పిత సర్వే ఫలితాలు, జోస్యాలు, తిరగబడ్డాయి. వారు మోడీని ఇంటర్వ్యూ చేసిన విధానం, వారు అడిగిన ప్రశ్నలు, పొగడ్తలు ప్రపంచం ముందు అప్రతిష్టను మూటగట్టుకున్నాయి.

పరువు పోగోట్టుకున్న గోదీ మీడియా!

ఇప్పుడు మనదేశంలో గోదీ మీడియాను నమ్మే నాధుడే కరువయ్యాడు. ఆ ఛానళ్ల ఊదరగొట్టే చర్చలను, అరుపులను, కేకలను వినేవారి సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. దృవ్ రాఠీ, రవీష్ కుమార్ లాంటి ఇండిపెండెంట్ యూట్యూబర్లకు గిరాకీ పెరిగింది. వారి వీడియోలకు లక్షల్లో అనూహ్యంగా వ్యూయర్స్ పెరిగారు. వారు ప్రజాస్వామ్యంలో సామాన్య ప్రజల గొంతుకను వినిపిస్తున్నారు. మన తెలుగులో నిజాయితీని ప్రాణప్రదంగా భావించే యూట్యూబర్లకు వీక్షకుల ఆదరణ క్రమంగా పెరుగుతోంది. పేరుమోసిన పెద్ద పత్రికలు ఏదో ఒక పార్టీతో జతకట్టడంతో నిష్పాక్షిక వార్తలను చేరవేసే చిన్న పత్రికలకు ప్రజలలో ఆదరణ పెరుగుతోంది.

డా. కిశోర్ ప్రసాద్

98493 28496

Advertisement

Next Story

Most Viewed