ద్వీపంలో పొడిచిన అరుణతార

by Ravi |
ద్వీపంలో పొడిచిన అరుణతార
X

శ్రీలంక గణనీయమైన ఆర్థిక సవాళ్లు, రాజకీయ అనిశ్చితితో పోరాడుతూనే ఉంది, మార్పు కోరుకునే అనేక మంది పౌరులకు ఆశాచిహ్నంగా ఉద్భవించింది. 55 ఏళ్ల వయసులో, దేశంలోని దీర్ఘకాలంగా వేళ్ళూనుకున్న రాజకీయ ప్రముఖులచే భ్రమింపబడిన వారి ఆకాంక్షలను సాకారం చేసే ప్రముఖ నాయకుడిగా అనుర కుమార దిసానాయకే ఇప్పుడు నిలిచారు. శ్రీలంకకు అనురాకుమార్ దిసనాయకే తొమ్మిదో అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. గత ఎన్నికల్లో కేవలం మూడు శాతం ఓట్లు మాత్రమే సాధించిన ఆయన.. ఈ ఎన్నికల్లో మార్పు, అవినీతి వ్యతిరేక సమాజ నిర్మాణం వంటి నినాదాలతో విస్తృతంగా ప్రచారం చేసి అపూర్వ జనాదరణ పొందారు.

ఎవరీ దిసనాయకే..?

విద్యార్థి నేతగా మొదలై.. దేశాధినేత వరకు ఎదిగిన దిసనాయకే శ్రీలంక రాజకీయాల్లో ఓ సంచలనం! 1968 నవంబర్ 24న కొలంబోకు 100 కి.మీ దూరంలో ఉన్న తంబుట్టెగామలో కార్మిక కుటుం బంలో ఆయన జన్మించారు. స్థానికంగానే పాఠశాల విద్యనభ్యసించిన దిసనాయకే.. తమ గ్రామం నుంచి యూనివర్సిటీలో ప్రవేశం పొందిన తొలి విద్యార్థి కావడం విశేషం. తొలుత పెరదేనియా విశ్వవిద్యాలయంలో చేరగా.. రాజకీయ సిద్ధాంతాల కారణంగా ఎదురైన బెదిరింపులతో కెలానియా విశ్వవిద్యాలయానికి బదిలీ అయినట్లు గతంలో ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ గ్రాడ్యుయేట్ పట్టా అందుకున్న ఆయన.. ఆ తర్వాత సోషలిస్టు స్టూడెంట్స్ అసోసియేషన్ లో చేరి విద్యార్థి రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించారు.

రాజకీయ జీవితం ఇలా..

1987లో మార్క్సిస్టు ప్రభావిత జనతా విముక్తి పెరమునా (JVP)లో చేరిన దిసనాయకే.. తన రాజకీయ పునాది నిర్మించుకున్నారు. 1998 నాటికి జేవీపీ నిర్ణయాధికార విభాగం పొలిట్ బ్యూరోలో చోటు దక్కించుకున్నారు. 2000లో ఎంపీ అయిన దిసనాయకే.. 2004లో శ్రీలంక ఫ్రీడమ్ పార్టీతో కలిసి జేఎన్ఏపీ ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. చంద్రికా కుమారతుంగ ప్రభుత్వంలో ఆనాడు వ్యవసాయ, నీటిపారుదల శాఖ మంత్రిగా సేవలందించారు. 2005లో సునామీ సహాయక సమన్వయం కోసం ప్రభుత్వం, ఎల్టీటీఈ మధ్య ఉమ్మడి ఒప్పందంపై అంగీకారం కుదరకపోవడంతో తలెత్తిన విభేదాలతో తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.

అవినీతి వ్యతిరేక పోరాట గళం

శ్రీలంకలో 2022లో తలెత్తిన ఆర్థిక సంక్షోభం తర్వాత ప్రజల అసంతృప్తిని ఆయుధంగా మలచుకొని సమరశంఖం పూరించారు. మార్పు, అవినీతి వ్యతిరేక సమాజ నిర్మాణం వంటి నినాదాలతో విస్తృతంగా ప్రచారం చేసి అపూర్వ జనాదరణ పొందారు. వ్యవస్థాగత మార్పు కోసం నినదించారు. ఎన్నికల ప్రసంగాల్లో గత పాలకుల అవినీతి, వైఫల్యాలను ఎత్తిచూపుతూనే.. జవాబుదారీతనం ప్రాముఖ్యతను ప్రజలకు వివరించారు. ఆర్థిక సంక్షోభానికి మూల కారణాలను పరిష్కరించడంలో గత పాలకుల వైఫల్యాలను ఎత్తి చూపారు. అంతేకాకుండా తమ పార్టీ మ్యానిఫెస్టోలో విద్యావ్యవస్థలో సంస్కరణలు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ప్రజారోగ్యానికి పెద్దపీట వేయడంతో పాటు అనేక ప్రజా సంక్షేమ విధానాలతో ప్రజల్ని తనవైపు ఆకట్టుకోవడంలో విజయవంతమయ్యారు. శ్రీలంక ఆర్థిక సంక్షోభం, రాజపక్స రాజీనామా వంటి పరిణామాలతో ఏర్పడిన నాయకత్వ శూన్యత, ప్రజల్లో నిరుత్సాహం కమ్ముకొని ఉన్న పరిస్థితుల్లో వ్యవస్థలో మార్పు రావాలని కోరుకుంటున్న యువతను.. అవినీతి వ్యతిరేక వైఖరితో ఆకట్టుకోవడంలో దిసనాయకే సఫలీకృతులయ్యారు.

అంతర్జాతీయ సహకారం అవసరం!

ద్రవ్యోల్బణం, విదేశీ మారక నిల్వలు దాదాపుగా ఖాళీ అవ్వడం, వైద్య సామాగ్రి కొరత, ప్రాథమిక వస్తువుల ధరల పెరుగుదల వంటి పర్యవసానాలు తలెత్తాయి. విపరీతంగా నోట్ల ముద్రణ, సేంద్రియ లేదా జీవ వ్యవసాయానికి మారడానికి తీసుకొచ్చిన దేశవ్యాప్త విధానం, 2019లో జరిగిన ఈస్టర్ బాంబు దాడులు, కోవిడ్-19 మహమ్మారి వంటి బహుళ కారణాల వల్ల ఈ సంక్షోభం ప్రారంభమైంది. ఈ ఆర్థిక కష్టాలు 2022లో ప్రజల నిరసనలకు దారితీసాయి. ప్రజల ప్రతిభను, జ్ఞానాన్ని వినియోగించుకుని దేశాన్ని నడిపించేందుకు మెరు గైన నిర్ణయాలు తీసుకోవడమే తన కర్తవ్యం. రాజకీయ స్థిరత్వాన్ని ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడం కోసం, రాజకీయ స్థిరత్వాన్ని కొనసాగిస్తూ దేశంలోని దీర్ఘకాలంగా వేళ్ళూనుకున్న అవినీతి ఆర్థిక అనిశ్చితి రూపుమాపి దేశ ప్రజల ఆకాంక్షలను సాకారం చేసే చర్యలు ద్వారా అనురా కుమార్ దిసనాయకే నాయకత్వం సరికొత్త దిశను చూపగలదు.

- సుధాకర్ వి

99898 55445

Next Story