యువకుడు మృతి.. అంజలి సిమెంట్ ఫ్యాక్టరీ ముందు ధర్నా

by Sridhar Babu |
యువకుడు మృతి..  అంజలి సిమెంట్ ఫ్యాక్టరీ ముందు ధర్నా
X

దిశ, హుజూర్‌నగర్: గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో యువకుడు మృతిచెందిన సంఘటన హుజూర్‌నగర్ నియోజకవర్గంలోని చింతలపాలెం మండలంలోని అంజలి (చిట్టినాడు)సిమెంట్ ఫ్యాక్టరీ ప్రాంతంలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. చింతలపాలెం ఎస్సై మహేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని నెమిలిపురి గ్రామానికి చెందిన కొమ్ము వెంకటరామారావు (25) అంజలి (చిట్టినాడు) సిమెంట్ పరిశ్రమల్లో ప్రైవేటు ఉద్యోగిగా పని చేస్తున్నట్లు తెలిపారు. అతనిది ఉదయం డ్యూటీ కావడంతో ఉదయం 6.30 నిమిషాల సమయంలో ఇంటి నుండి బయలుదేరి బైక్‌పై వెళుతుండగా.. ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాలకు వెళ్లే సరికి గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది.

బైక్‌తో పాటు అతడు చెట్ల పొదల్లో పడి మృతి చెందినట్లు తెలిపారు. మృతుని తల్లి పుష్పమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, పోస్టుమార్టం నిమిత్తం హుజూర్ నగర్ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రులకు తరలిస్తున్నామని తెలిపారు. మృతునికి మూడు నెలల క్రితమే శిరిషతో వివాహం జరిగిందని తెలిపారు.

అంజలి సిమెంట్ ఫ్యాక్టరీ ముందు ధర్నా

ఫ్యాక్టరీ చెందిన లారీ ఢీకొట్టడంతోనే వెంకటరామారావు మృతిచెంది ఉంటాడని బంధువులు, గ్రామస్థులు భావించి మృతదేహాన్ని ఆ ఫ్యాక్టరీ గేటు ముందు వేసి ఆందోళన చేపట్టారు. ఉదయం సమయంలో సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించిన లారీలు తప్ప వేరే ఏ లారీలు గాని, ఇతర వాహనాలు గాని వెళ్ళవని ఆరోపిస్తూ ఆందోళన చేశారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై మహేందర్ రెడ్డి.. ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన చేస్తున్న వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇస్తే విచారణ జరిపి ఢీకొట్టిన వాహనాన్ని పట్టుకొని మీకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed