రాష్ట్రపతికి రిపోర్ట్ పంపితే గవర్నర్‌ను నమ్మేవాళ్లం

by  |
రాష్ట్రపతికి రిపోర్ట్ పంపితే గవర్నర్‌ను నమ్మేవాళ్లం
X

దిశ, న్యూస్‌బ్యూరో: ప్రభుత్వంపై గవర్నర్ విమర్శలు చేయడం కాదని, పరిస్థితిని చక్కదిద్దాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ సూచించారు. కేంద్రబృందం వచ్చి రాష్ట్ర ప్రభుత్వం బాగా పనిచేస్తోందని అంటున్నారని, గవర్నర్ ఏమో సరిగా పని చేయడం లేదంటున్నారని, అసలు ఏం జరుగుతోందని శ్రవణ్ ప్రశ్నించారు. కేంద్ర బృందంతో అసలు విషయాన్ని గవర్నర్ ఎందుకు చెప్పలేదని ఆయన ప్రశ్నించారు. వ్యవహారం చూస్తుంటే బీజేపీ, టీఆర్ఎస్‌లు డ్రామాలు ఆడుతున్నట్లు కనిపిస్తోందని అన్నారు. బీజేపీ నేతలేమో ప్రభుత్వాన్ని తప్పుడుతున్నారని, కేంద్ర మంత్రులు వచ్చి పొగిడి పోతారని విమర్శించారు.

ఈ మొత్తం వ్యవహారంలో గవర్నర్ జోక్యం చేసుకుని ప్రధానితో మాట్లాడాలని, రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై జోక్యం చేసుకోవాలని కోరాలని శ్రవణ్ పేర్కొన్నారు. ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం బీజేపీ, టీఆర్ఎస్ చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. వచ్చే గ్రేటర్ ఎన్నికల కోసమే రెండు పార్టీలు కలిసి డ్రామాలు ఆడుతున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వం వైఫల్యాలపై రాష్ట్రపతికి, ప్రధానికి, కేంద్రమంత్రికి నివేదిక పంపితే గవర్నర్‌ని నమ్మేవాళ్లం అని శ్రవణ్ చెప్పారు.


Next Story

Most Viewed