Stock Market: మరోసారి నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

by S Gopi |
Stock Market: మరోసారి నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లలో బలహీన ర్యాలీ కొనసాగుతోంది. అంతకుముందు రెండు సెషన్‌లలో నీరసించిన సూచీలు గురువారం ట్రేడింగ్‌లో మరింత నష్టాలను చూశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు కొనసాగడం, దేశీయంగా కూడా బ్లూచిప్ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి, గరిష్ఠాల వద్ద లాభాల స్వీకరణ కారణంగా దెబ్బతిన్నాయి. ప్రధానంగా అమెరికాలో జాబ్ డేటా వెలువడనున్న కారణంగా గ్లోబల్ మార్కెట్లలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. జాబ్ డేటా ఆధారంగా ఫెడ్ వడ్డీ రేట్లలో కోత విధించడంపై నిర్ణయం తీసుకోనుంది. ఈ పరిణామాల కారణంగా మన మార్కెట్లలో ఒత్తిడి కనిపించింది, ముఖ్యంగా రిలయన్స్, ఎయిర్‌టెల్ వంటి దిగ్గజ కంపెనీల షేర్లలో అమ్మకాలు అధికంగా జరిగాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 151.48 పాయింట్లు నష్టపోయి 82,201 వద్ద, నిఫ్టీ 53.60 పాయింట్ల నష్టంతో 25,145 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఐటీ, మీడియా, మెటల్, పీఎస్‌యూ బ్యాంక్, ఫైనాన్స్ రంగాలు రాణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో టైటాన్, ఐటీసీ, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, టాటా స్టీల్, ఎస్‌బీఐ షేర్లు లాభాలను సాధించాయి. రిలయన్స్, టాటా మోటార్స్, నెస్లె ఇండియా, భారతీ ఎయిర్‌టెల్, ఎల్అండ్‌టీ, బజాజ్ ఫైనాన్స్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.99 వద్ద ఉంది.

Advertisement

Next Story

Most Viewed