Samsung: ఏఐ ఆధారిత స్మార్ట్ రింగ్ విడుదల చేసిన శాంసంగ్

by S Gopi |
Samsung: ఏఐ ఆధారిత స్మార్ట్ రింగ్ విడుదల చేసిన శాంసంగ్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఎట్టకేలకు మొబైల్ తయారీ సంస్థ శాంసంగ్ భారత మార్కెట్లో తన మొదటి స్మార్ట్ రింగ్‌ను విడుదల చేసింది. ఈ ఏడాది జూలైలో జరిగిన ఈవెంట్‌లో గెలాక్సీ కొత్త ఫోల్డబుల్ ఫోన్‌తో పాటు స్మార్ట్ గెలాక్సీ రింగ్‌కు కంపెనీ లాంచ్ చేసింది. బుధవారం భారత మార్కెట్లో అందుబాటులోకి తీసుకొచ్చినట్టు ప్రకటించింది. గ్రేడ్-5 టైటానియంతో తయారు చేసిన ఈ రింగ్ ఐపీ68 రేటింగ్, 10ఏటీఎం సర్టిఫికేట్‌తో లభిస్తుంది. దీన్ని రూ. 38,999 ధరలో తీసుకొచ్చామని, తొమ్మిది సైజుల్లో వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. టైటానియం బ్లాక్, టైటానియం సిల్వర్, టైటానియం గోల్డ్ రంగుల్లో ఇది లభిస్తుంది. గెలాక్సీ ఏఐ ద్వారా చాలా రకాల హెల్త్‌ ఫీచర్లు, హెల్త్-ట్రాకింగ్ సెన్సార్లు ఇందులో ఉంటాయి. హార్ట్ బీట్, మూవ్‌మెంట్స్, శ్వాస ఆధారంగా వ్యక్తి నిద్రపోయే తీరును ఇది సమీక్షిస్తుంది. శాంసంగ్ అధికారిక ప్లాట్‌ఫామ్‌తో పాటు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, కొన్ని రిటైల్ దుకాణాల్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఒకసారి ఛార్జింగ్ చేయడం ద్వారా ఈ రింగ్ బ్యాటరీ వారం రోజుల పాటు పనిచేస్తుంది.

Advertisement

Next Story