ప్రజలపై మళ్ళీ వడ్డీ రేట్ల భారం..! రెపోరేటు 25 బేసిస్ పాయింట్ల పెంపు

by Harish |   ( Updated:2023-02-08 11:19:31.0  )
ప్రజలపై మళ్ళీ వడ్డీ రేట్ల భారం..! రెపోరేటు 25 బేసిస్ పాయింట్ల పెంపు
X

ముంబై: భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) అంచనాలకు అనుగుణంగానే మరోసారి కీలక వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అధిక ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తెచ్చేందుకు గాను ఈసారి కీలక రెపోరేటును 25 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్టు బుధవారం ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ప్రకటించారు. దీంతో రెపో రేటు 6.5 శాతానికి చేరుకుంది.

ఈ సందర్భంగా ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన(ఎంపీసీ) సమావేశ నిర్ణయాలను వెల్లడించిన దాస్, గత మూడేళ్ల నుంచి అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతున్నాయని, ఈ క్రమంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ప్రధానంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ లో ద్రవ్యోల్బణం, ఆర్థిక వ్యవహారాలు ఇబ్బందిగా మారాయని, ఇటీవల పరిస్థితులు మెరుగ్గా ఉంటున్నాయని వివరించారు.

6.5 శాతం వద్ద ఉన్న ప్రస్తుత రెపో రేటు ఇంకా మహమ్మారికి ముందు స్థాయిని చేరుకోవాల్సి ఉందని దాస్ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భిన్న పరిణామాలు పాలసీ విధానానికి సవాలుగా మారాయన్నారు. అంతర్జాతీయంగా గిరాకీ బలహీనంగా ఉండటం దేశ వృద్ధికి సవాలుగా ఉందని, అందుకే ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు మరోసారి 25 బేసిస్ పాయింట్లు పెంచామని దాస్ పేర్కొన్నారు.

కాగా, ఆర్‌బీఐ నిర్ణయంతో ప్రజల వివిధ రుణాలపై చెల్లించే ఈఎంఐలపై ప్రభావం ఉండనుంది. రెపో రేటు నేరుగా బ్యంకులు అందించే లోన్ వడ్డీ రేట్లతో ముడిపడి ఉంటుంది, కాబట్టి రెపోలో పెరుగుదల రుణాల ఖర్చులను పెంచుతుంది.

Next Story

Most Viewed