జూన్ నెలలో రికార్డు స్థాయిలో ఆస్తి రిజిస్ట్రేషన్లు నమోదు చేసిన ముంబై

by Harish |
జూన్ నెలలో రికార్డు స్థాయిలో ఆస్తి రిజిస్ట్రేషన్లు నమోదు చేసిన ముంబై
X

దిశ, బిజినెస్ బ్యూరో: ముంబై నగరం జూన్ 2024లో రికార్డు స్థాయిలో సుమారు 11,443 ఆస్తి రిజిస్ట్రేషన్‌లను నమోదు చేసిందని రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ అయిన నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక పేర్కొంది. గత 12 సంవత్సరాలలో ఏ జూన్ నెలలో కూడా ఇన్ని రిజిస్ట్రేషన్‌లు నమోదు కాలేదని, ప్రజలు ఇళ్లు, స్థలాల కొనుగోలుకు ఎక్కువ ఆసక్తిని కనబరుస్తున్నారని నివేదిక పేర్కొంది. జూన్ నెలలో జరిగిన ప్రాపర్టీ(ఆస్తి) రిజిస్ట్రేషన్ల ద్వారా రాష్ట్ర ఖజానాకు రూ. 986 కోట్లకు పైగా ఆదాయం లభించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే, ముంబైలో ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు సంవత్సరానికి 11 శాతం పెరిగాయని, ఈ రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయాలు 15 శాతం పెరిగాయని నివేదిక పేర్కొంది.

జూన్ 2023లో, ముంబై నగర ప్రాంతంలో మొత్తం 10,319 ఆస్తి రిజిస్ట్రేషన్లు జరిగాయి. 2023లో పన్నెండు నెలల సగటు 10,578 యూనిట్లతో పోలిస్తే, 2024 మొదటి ఆరు నెలల్లోనే నమోదైన యూనిట్ల సగటు 12,044 గా ఉండటం గమనార్హం. బలమైన జీడీపీ వృద్ధి, పెరుగుతున్న ఆదాయ స్థాయిలు, అనుకూలమైన వడ్డీ రేటు, ప్రోత్సాహకరమైన వాతావరణం కారణంగా గృహాల రిజిస్ట్రేషన్లు తమ ఊపును కొనసాగించాయి. ముఖ్యంగా జూన్ 2024లో, 500 నుంచి 1,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న అపార్ట్‌మెంట్ల రిజిస్ట్రేషన్‌లో గణనీయమైన పెరుగుదల కనిపించింది, ఈ విభాగం మొత్తం ఆస్తి రిజిస్ట్రేషన్‌లలో 46 శాతంగా ఉంది.

500 కంటే తక్కువ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న అపార్ట్‌మెంట్‌లు 36 శాతం నమోదు చేశాయి. మరోవైపు 1,000 చదరపు అడుగులు, అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న అపార్ట్‌మెంట్లు మొత్తం రిజిస్ట్రేషన్లలో 15 శాతం ఉన్నాయి. నైట్ ఫ్రాంక్ ఇండియా ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శిశిర్ బైజల్ మాట్లాడుతూ, ప్రాపర్టీ సేల్ రిజిస్ర్టేషన్‌లలో సంవత్సరానికి నిరంతర వృద్ధిలో ముంబై రియల్ ఎస్టేట్ మార్కెట్ స్థితిస్థాపకతను సూచిస్తుందని అన్నారు.

Next Story

Most Viewed