రాజస్థాన్‌లో జేఎస్‌డబ్ల్యూ సిమెంట్ రూ. 3,000 కోట్ల పెట్టుబడి

by S Gopi |
రాజస్థాన్‌లో జేఎస్‌డబ్ల్యూ సిమెంట్ రూ. 3,000 కోట్ల పెట్టుబడి
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ జేఎస్‌డబ్ల్యూ గ్రూపునకు చెందిన సిమెంట్ వ్యాపార విభాగం జేఎస్‌డబ్ల్యూ సిమెంట్ కొత్త తయారీ ప్లాంటును ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లాలో రూ. 3,000 కోట్ల పెట్టుబడితో ఈ కొత్త సిమెంట్ తయారీ ప్లాంటు నిర్మించనున్నట్టు తెలిపింది. దీనికోసం కంపెనీ రుణాలు, ఈక్విటీల ద్వారా నిధులను సమకూర్చనున్నట్టు పేర్కొంది. కొత్త ప్లాంటులో క్లింకరైజేషన్, గ్రైండింగ్ యూనిట్లు, 18 మెగావాట్ల వేస్ట్ హీట్ రికవరీ ఆధారిత విద్యుదుత్పత్తి వ్యవస్థ ఉంటాయని, తద్వారా 1,000 మందికి పైగా ఉపాధి పొందనున్నట్టు కంపెనీ వివరించింది. గనుల నుంచి సిమెంట్ తయారీ ప్లాంటుకు సున్నపురాయిని రావాణా చేసేందుకు 7 కిలోమీటర్ల మేర ఓవర్‌ల్యాండ్ బెల్ట్ కన్వేయర్ కూడా ఉంటుందని కంపెనీ తెలిపింది. ప్రస్తుతం కంపెనీ ఏటా 1.90 కోట్ల టన్నుల తయారీ సామర్థ్యం కలిగి ఉంది. దీన్ని 6 కోట్ల టన్నులను పెంచాలని లక్ష్యంతో ఉన్నామని జేఎస్‌డబ్ల్యూ సిమెంట్ ఎండీ పార్థ్ జిందాల్ వెల్లడించారు. ప్రస్తుతం కంపెనీకి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, మహారాష్ట్రలలో తయారీ యూనిట్లు ఉన్నాయి. అంతేకాకుండా కంపెనీ అనుబంధ శివ సిమెంట్ ద్వారా ఒడిశాలో క్లింకర్ యూనిట్‌ను కూడా నిర్వహిస్తోంది.



Next Story