GST Council: జీవిత, ఆరోగ్య బీమాపై జీఎస్టీ పరిశీలనకు మంత్రుల బృందం

by S Gopi |
GST Council: జీవిత, ఆరోగ్య బీమాపై జీఎస్టీ పరిశీలనకు మంత్రుల బృందం
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జరిగిన 54వ జీఎస్టీ కౌన్సిల్‌ భేటీ జరిగింది. ఈ సమావేశంలో వివిధ అంశాలపై విస్తృతంగా చర్చించారు. అయితే, ఈ కౌన్సిల్ సమావేశంలోనే నిర్ణయం తీసుకుంటారని భావించిన ఆరోగ్య, జీవిత బీమా ప్రీమియంలపై జీఎస్టీని తగ్గింపు అంశం వాయిదా పడింది. వీటిపై ప్రస్తుతం 18 శాతం జీఎస్టీని కేంద్రం విధిస్తోంది. దీన్ని తగ్గించాలనే దానిపై జీఎస్టీ కౌన్సిల్‌లో ఏకాభిప్రాయానికి వచ్చింది. కానీ, తొలుత మంత్రుల బృందాన్ని (జీఓఎం) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తదుపరి నవంబర్‌లో జరగబోయే భేటీలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. సోమవారం సమావేశం అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడిన సీతారామన్.. జీవిత, ఆరోగ్య బీమాపై జీఎస్టీ రేటును సమీక్షించేందుకు మంత్రుల బృందం అవసరమని భావించినట్టు చెప్పారు. ప్రస్తుతం జీఎస్టీ రేటు హేతుబద్ధీకరణపై ప్యానెల్‌కు నేతృత్వం వహిస్తున్న బీహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరినే తాజా సమీక్ష బృందానికి కూడా నేతృత్వం వహించనున్నారు. అక్టోబరు నెలాఖరులోగా జీఓఎం తన నివేదికను సమర్పించనుందని నిర్మలా సీతారామన్ తెలిపారు.

ఇక, సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి స్నాక్స్, క్యాన్సర్ మందులపై జీఎస్టీని తగ్గించాలని నిర్ణయించారు. క్యాన్సర్ ఔషధాలపై పన్ను రేట్లను 12 శాతం నుంచి 5 శాతానికి, స్నాక్స్‌పై 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గించారు. అదేవిధంగా ఆర్థిక బిల్లుపై చర్చకు సంబంధించిన అంశంలో కేంద్ర సేకరించిన జీఎస్‌టీలో 75 శాతం రాష్ట్రాలకు వెళ్తాయని అన్నారు. 2026, మార్చి తర్వాత జీఎస్టీ పరిహారా సెస్సును కొనసాగించడంపై నిర్ణయం తీసుకోనున్నట్టు చెప్పారు. దీనిపై కూడా మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సమావేశంలో ఆన్‌లైన్ గేమింగ్‌పై జీఎస్టీ, జీఎస్టీ రేట్ల హేతుబద్దీకరణ అంశాలు చర్చకు వచ్చాయని సమాచారం.

సమావేశంలో తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలు..

* కేంద్ర, రాష్ట్ర-అనుబంధ విశ్వవిద్యాలయాలు, ఆదాయ-మినహాయింపు సంస్థలకు ఇచ్చిన నిధులు జీఎస్టీ నుంచి మినహాయింపు.

* ఆన్‌లైన్ గేమింగ్, క్యాసినోలు, రేస్‌కోర్సుల కోసం ఇప్పటికే ఉన్న నిబంధనలను కొనసాగించాలని కౌన్సిల్ నిర్ణయించింది.

* కార్ సీట్లపై జీఎస్టీ రేటును 18 శాతం నుంచి 28 శాతానికి పెంచారు. ఇప్పటికే మోటార్‌సైకిళ్ల సీట్లపై 28 శాతం జీఎస్టీ విధిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed