3 నెలల ఏపీ బడ్జెట్ ఆర్డినెన్స్‌కు గ్రీన్ సిగ్నల్

by  |
3 నెలల ఏపీ బడ్జెట్ ఆర్డినెన్స్‌కు గ్రీన్ సిగ్నల్
X

దిశ, న్యూస్ బ్యూరో: ఏప్రిల్ 1తో ప్రారంభమయ్యే కొత్త ఆర్థిక సంవత్సరం(2020-21)లో తొలి 3 నెలల బడ్జెట్ నిధుల వాడకం కోసం ప్రత్యేకంగా రూపొందించిన బడ్జెట్ ఆర్డినెన్స్‌కు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. కరోనా వ్యాప్తి నిరోధానికి రాష్ట్రంలో లాక్ డౌన్ అమలవుతుండడంతో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించలేని ప్రత్యేక పరిస్థితుల్లో కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో ఆర్థిక ప్రగతి కుదేలైందని కేబినెట్ అభిప్రాయపడింది. కరోనా వ్యాప్తి నిరోధానికి తీసుకోవాల్సిన చర్యలు, రాష్ట్రంలో లాక్‌డౌన్ పరిస్థితిపై ఆంధ్రప్రదేశ్ కేబినెట్ శుక్రవారం భేటీ అయింది. ఈ భేటీలో ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంది. కరోనా వ్యాప్తిని నిరోధించడానికి తీసుకోవలసిన చర్యల నిరంతర పర్యవేక్షణకు ప్రత్యేక మంత్రుల కమిటీ ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ కమిటీలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, బొత్స సత్యనారాయణ, మేకతోటి సుచరిత, కన్నబాబు సభ్యులుగా ఉంటారని నిర్ణయించింది. కరోనా నిరోధానికి ప్రతి జిల్లాకు రూ.2 కోట్లు కేటాయించారు. ఈ ప్రత్యేక మంత్రుల కమిటీ ప్రతిరోజు వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష జరిపి అవసరమైన నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా భేటీలో సీఎం ఆదేశించారు. వైరస్ నిరోధానికి ఎలాంటి చర్యలు తీసుకోవడానికైనా వెనుకాడొద్దని, ఇందు కోసం ఎంత ఖర్చైనా సిద్ధంగా ఉండాలని అధికారులకు సీఎం సూచించారు. రాష్ట్రంలో ఇల్లు లేకుండా రోడ్ల పైన నివసించే వారిని కళ్యాణ మండపాల్లోకి తరలించి బాగోగులు చూడాలని కేబినెట్‌లో నిర్ణయించారు. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన రాష్ట్ర వాసులకు ఆయా రాష్ట్రాల్లో అయ్యే భోజన, వసతుల కోసం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడాలని అధికారులను సీఎం ఆదేశించారు. కాశీలో చిక్కకున్న తెలుగువారికి యూపీ, ఏపీ ప్రభుత్వాలు కలిసి ఒకవేళ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడే భోజన వసతులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ విషయంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చులకు వెనుకాడితే వారి భోజన వసతులకయ్యే ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తికి తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కేబినెట్‌కు వివరించారు.

Advertisement

Next Story

Most Viewed