పార్లమెంటులో విపక్షాల నిరసన.. పెగాసస్, సాగు చట్టాలపై చర్చకు పట్టు

by Shamantha N |
పార్లమెంటులో విపక్షాల నిరసన.. పెగాసస్, సాగు చట్టాలపై చర్చకు పట్టు
X

న్యూఢిల్లీ : పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఏడో రోజూ హైడ్రామా కొనసాగింది. పెగాసస్ స్పైవేర్‌, సాగు చట్టాలు సహా పలు అంశాలపై చర్చించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. బుధవారం ఈ నిరసనలు మరింత తీవ్రరూపం దాల్చాయి. ఉభయ సభలు బుధవారం నిరసనలతో ప్రారంభమయ్యాయి. లోక్‌సభలో కాంగ్రెస్ నేతలు కాగితాలు చింపి డిప్యూటీ చైర్మన్ హరివంశ్‌పైకి విసిరేశారు. ‘ఖేలా హోబే’(పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ స్లోగన్) అని నినదిస్తూ నిరసనలు చేశారు. దీనిపై కనీసం పది మంది ఎంపీలను సస్పెండ్ చేయాలని అధికారపక్షం భావించింది.

కానీ, స్పీకర్ ఓం బిర్లా ఎంపీలపై చర్యలు వద్దని భావించారు. అనంతరం కాంగ్రెస్ లోక్‌సభాపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి పశ్చాత్తాపం ప్రకటించారు. పలుసార్లు వాయిదాపడ్డ తర్వాత మధ్యాహ్నం విపక్ష నేతలు లోక్‌సభలోకి ఓ బ్యానర్‌ను పట్టుకెళ్లారు. పెగాసస్‌పై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలనే డిమాండ్ దానిపై రాసి ఉంది. రాజ్యసభలోనూ ఇదే వరస. ఉదయం సభ నిరసనలతోనే ప్రారంభమైంది. తప్పనిసరి పరిస్థితుల్లో రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు సభను వాయిదా వేశారు. ఇలా సాయంత్రం వరకు చాలా సార్లు వాయిదా పడింది. నిరసనలు, వాయిదాల మధ్యలోనే కొన్ని కీలక బిల్లులను సభలు ఆమోదించాయి.

స్టాండింగ్ కమిటీ(ఐటీ)లోని 30 మందిలో 17 మందికి కమిటీ చైర్మన్ శశిథరూర్‌పై విశ్వాసం లేదని స్పీకర్‌కు రాశారని, స్టాండింగ్ కమిటీ చైర్మన్ తొలగింపుపై నిబంధనలు లేవని బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే పేర్కొన్నారు. శశిథరూర్‌ను తొలగించాలని ప్రివిలేజ్ మోషన్ ప్రవేశపెట్టినట్టు వివరించారు. మధ్యాహ్నం రెండున్నర ప్రాంతంలో దివాళా చట్ట సవరణ బిల్లును దిగువసభలో ప్రవేశపెట్టగా మూజువాణి ద్వారా ఆమోదం లభించింది. జువెనైల్ జస్టిస్ సవరణ బిల్లును రాజ్యసభ ఆమోదించింది.

కాగా, జమ్ము కశ్మీర్‌‌లో సాధారణ పరిస్థితులు ఏర్పడ్డ తర్వాత తగిన సమయంలో రాష్ట్ర హోదా కల్పిస్తామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ రాజ్యసభకు తెలియజేశారు. ఫ్రాన్స్ నుంచి ఇండియాకు ఇప్పటి వరకు 26 రాఫెల్ జెట్లు వచ్చాయని, మొత్తం 36 యుద్ధ విమానాలను అందించే ప్రక్రియ సాగుతున్నదని రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ లోక్‌సభకు వివరించారు.

ప్రతులను చింపడం సరికాదు: కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్

పార్లమెంటులో దేశ ప్రయోజన అంశాలపై చర్చ జరగాలని, అందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. చర్చలకు ముందు కరోనాపై చర్చించాలని కాంగ్రెస్ రాజ్యసభపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ ప్రధాని మోడీకి లేఖ రాశారని గుర్తుచేశారు. అందుకు అనుగుణంగా ఫ్లోర్ లీడర్ల కోసం ప్రధాని ఓ ప్రెజెంటేషన్ సిద్ధం చేశారని, కానీ, ప్రతిపక్ష నేతలే అందుకు హాజరవ్వలేదని విమర్శించారు. ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉన్నదని, విపక్ష నేతలు మంత్రుల చేతులో నుంచి స్టేట్‌మెంట్ పేపర్లు లాక్కుని చింపి గాల్లో విసరడం, స్పీకర్‌పై ప్రతులను చింపి విసిరేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అన్నారు.

Advertisement

Next Story