ఇదేం ఘోరం.. శ్మశానాన్ని వదల్లేదు..!

by srinivas |
ఇదేం ఘోరం.. శ్మశానాన్ని వదల్లేదు..!
X

దిశ, జీలుగుమిల్లి: తమకు ప్రభుత్వం ఇచ్చిన శ్మశాన వాటికను కొంతమంది కబ్జా చేసి వ్యవసాయం చేసుకుంటున్నారని పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి మండలం రాచన్నగూడెం తాట్కూరుగోమ్ము ఆర్‌అండ్‌ఆర్ కాలనీ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కబ్జా చేసిన వారిపై అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా, వారిపై కఠిన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.

ఈ సందర్భంగా తాట్కూర్ గొమ్ము గ్రామస్తులు సోందే నాగేశ్వరరావు, సోడే రాంబాబు, గోడ్ల ఎర్రయ్య, గోడ్ల వెంకటేశు, కార చందులు విలేకర్లతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు వల్ల సర్వం కోల్పోయిన మమ్మల్ని ప్రభుత్వం ఇక్కడకు తీసుకువచ్చిందని అన్ని వసతులు సక్రమంగా అందిస్తామని చెప్పి చేతులు దులుపుకున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో ఎవరైనా చనిపోతే దహన కార్యక్రమాలు చేయడానికి శ్మశాన వాటిక లేదని, అలాగే కట్టి ఇచ్చిన డాబాలు, స్లాబుల, వెంబడి నీరు కారుతుందన్నారు. కాలనీలో ఉన్న తమ స్థలాలను కొంతమంది బయట వారు ఆక్రమించారని, ఇది ఏమిటి అని మేము ప్రశ్నిస్తే మమ్మల్ని బెదిరిస్తున్నారని వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యలు పరిగణలోకి తీసుకొని తమ శ్మశాన వాటిక మాకు ఇప్పించి, భూములు కబ్జా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed