సీఎం జగన్ సంక్షేమం నగర అభివృద్దే తమ గెలుపుకు సోపానం-డిప్యూటీ స్పీకర్

by Disha Web Desk 18 |
సీఎం జగన్ సంక్షేమం నగర అభివృద్దే తమ గెలుపుకు సోపానం-డిప్యూటీ స్పీకర్
X

దిశ ప్రతినిధి,విజయనగరం:రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పాలన స్థానికంగా తాము చేసిన నగరాభివృద్ధి తమ విజయానికి సోపానాలుగా నిలవనున్నాయని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి అన్నారు. గురువారం జమ్మూ ప్రాంతంలో జరిగిన ఇంటింటి ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. కోలగట్ల రాకును పురస్కరించుకుని స్థానికులు పెద్ద ఎత్తున ఆహ్వానం పలికారు. పూలమాలలతో ముంచెత్తారు. మహిళలు హారతులు పట్టారు. కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు కోలగట్ల సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.వారందరికీ పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కోలగట్ల వీరభద్ర స్వామి మీడియాతో మాట్లాడుతూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే వారిని ప్రజలు ఎన్నుకోవాలని, ఎన్నికల అప్పుడే కనిపించే నాయకులను దూరంగా పెట్టాలని అన్నారు.

అవినీతి రహితంగా పూర్తి పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందించే ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. అందుకే ప్రజలు పెద్ద ఎత్తున వైసీపీకి ఆదరణ చూపుతున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కొన్ని పత్రికలు లేనిపోని ఆరోపణలు సృష్టించి లబ్ధి పొందాలని చూస్తున్నారన్నారు. అయితే తమపై ఎన్ని ఆరోపణలు చేసిన రుజువు చేయలేరని, తాము ధైర్యంగా ప్రజల వద్దకు వెళుతున్నామని అన్నారు. గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో గుర్తించిన అభివృద్ధి పనులను పూర్తి చేస్తామన్నారు. రహదారులు నిర్మించి, వాటిపైనే ఎన్నికల ప్రచారానికి వెళుతుంటే చెప్పలేనంత ఆనందంగా ఉందన్నారు.

అందుకే మహిళలు కూడా తమకు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. టీడీపీలో ఉండే కార్యకర్తలు అనేకమంది ఈరోజు తమ పార్టీలోకి రావడం సంతోషదాయకమన్నారు. వైసీపీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ గుర్తింపు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ విజయలక్ష్మి, రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి మండలి డైరెక్టర్ బంగారనాయుడు, స్థానిక కార్పొరేటర్ ఆల్తి సత్య కుమారి, ఏఎంసీ చైర్మన్ నడిపేన శశి భార్గవి, జోనల్ ఇన్చార్జిలు బొద్దాన అప్పారావు, రెడ్డి గురుమూర్తి,బోడసంగి ఈశ్వర రావు, పొంతపల్లి గోపి తదితరులు పాల్గొన్నారు.


Next Story