Andhra Universityలో డ్రీమ్ వాల్‌ను ప్రారంభించిన ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి

by srinivas |   ( Updated:2022-12-17 14:35:38.0  )
Andhra Universityలో డ్రీమ్ వాల్‌ను ప్రారంభించిన ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి
X

దిశ, ఉత్తరాంధ్ర: విశాఖలో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకులు ఎన్‌.ఆర్‌ నారాయణ మూర్తి పర్యటించారు. శనివారం ఏయూ పూర్వ విద్యార్థుల వార్షిక సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఏయూ పరిపాలనా భవనం వద్దకు చేరుకున్న ఆయన్ను వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద్‌ రెడ్డి సాదరంగా స్వాగతించారు. నారాయణ మూర్తిని ఏయూ పూర్వ విద్యార్థి, జీఎంఆర్‌ సంస్థల చైర్మన్‌ జీఎమ్మార్‌ స్వయంగా ఆహ్వానం పలికారు. వర్శిటీ గత ఉపకులపతి కట్టమంచి రామలింగారెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం ఏయూ విశేషాలు తెలుసుకున్నారు. ఏయూ ఇంజినీరింగ్‌ కళాశాలలో నూతనంగా ఏర్పాటైన హబ్‌ ఇంక్యుబేషన్‌ సెంటర్‌ను సందర్శించి అంకురాల్ని ప్రోత్సహిస్తున్న విధానం, భవిష్యత్‌ కార్యాచరణను సెంటర్‌ సీఈవో రవి ఈశ్వరపు ఆయనకు వివరించారు.


కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ విభాగం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన డ్రీమ్‌ వాల్‌ను నారాయణ మూర్తి ప్రారంభించారు. ప్రపంచ దేశాల్లో ప్రముఖ సంస్థల్ని స్థాపించి, నడిపిస్తున్న మహోన్నత వ్యక్తుల ఫోటోలతో దీనిని ఏర్పాటు చేశారు. గోడ మధ్యలో ఓ అద్దం ఏర్పాటు చేశారు. విద్యార్థులు రెండు మెట్లు ఎక్కితే అద్దంలో వారి ఫొటో కనిపించే విధంగా దీనిని తీర్చి దిద్దారు. ప్రముఖుల సరసన ఏయూ విద్యార్థి ఫొటో వచ్చేలా నిర్మించారు.

ఫార్మసీ కళాశాల పూర్వ విద్యార్థి కృపాకర్‌ పాల్‌ తన సొంత నిధులతో నిర్మించి ఇచ్చిన ఫార్మశీ కళాశాల భవనం, అమెరికన్‌ కార్నర్‌లను కూడా నారాయణ మూర్తి సందర్శించిన అనంతరం ఏయూ పూర్వ విద్యార్థుల కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ ఆయనకు విద్యార్థులు రహదారికిరువైపులా నిలిచి ఘనంగా స్వాగతం పలికారు. ఈకార్యక్రమంలో ఏయూ రెక్టార్‌ ఆచార్య కె.సమత, రిజిస్ట్రార్‌ ఆచార్య వి.కృష్ణమోహన్‌, పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు ఆచార్య బీల సత్యనారాయణ, ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఆచార్య పేరి శ్రీనివాస రావు, పూర్వ విద్యార్థుల సంఘం కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed