పోలీస్ కస్టడీకి వల్లభనేని వంశీ..

by Anil Sikha |
పోలీస్ కస్టడీకి వల్లభనేని వంశీ..
X

దిశ, డైనమిక్ బ్యూరో : దళితుడిని కిడ్నాప్ చేశారనే ఆరోపణలతో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు విచారణ నిమిత్తం కస్టడీకి తీసుకోనున్నారు. పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్‌పై ఇవాళ విచారణ జరిపిన ఎస్సీ, ఎస్టీ కోర్టు వంశీ 3 రోజుల పోలీస్‌ కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య మాత్రమే విచారించాలని పేర్కొంది. విజయవాడ పరిధిలోనే కస్టడీలోకి తీసుకుని విచారించాలని ఆదేశించింది. లాయర్ సమక్షంలో విచారణకు అనుమతి ఇచ్చింది. ఉదయం, సాయంత్రం మెడికల్‌ టెస్ట్‌లు చేయాలని సూచించింది. అదేవిధంగా జైలులో వంశీకి వసతుల కల్పనపై విచారణ చేపట్టింది. వంశీకి వెస్ట్రన్‌ టాయిలెట్‌, మంచం సదుపాయాలు కల్పించాలని ఆదేశించింది.

సత్యవర్ధన్​ అనే వ్యక్తిని కిడ్నాప్​ చేసిన కేసులో వంశీని ఈ నెల 13న హైదరాబాద్​లో అరెస్టు చేశారు. తనను కులం పేరుతో దూషించారంటూ సత్యవర్ధన్​పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ హైకోర్టును ఆశ్రయించగా ఆయనకు ఊరట దక్కలేదు. మరోవైపు దాడికి సంబంధించి ఇప్పటికే పోలీసులు వీడియోలను సేకరించారు. అయితే అరెస్టు సమయంలో ఆయన ఫోన్​మాయమైంది. దాని కోసం పోలీసులు విజయవాడ, హైదరాబాద్​లలో ఆయన నివాసంలో తనిఖీలు చేశారు. రేపటి విచారణలో ఆయన ఫోన్​ ఆచూకీ తెలిసే అవకాశం ఉంది.

ప్రస్తుతం రిమాండ్​ఖైదీగా ఉన్న వంశీ రిమాండ్​గడువు నేటితో ముగుస్తుంది. ఆయనను రేపు కోర్టులో హాజరుపరచాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఆయనపై పోలీసులు మరో రెండు పీటీ వారెంట్లు జారీ చేశారు. ఈ కేసులో రిమాండు పొడిగించినా, పొడిగించకపోయినా.. మరో కేసులో అరెస్టు చూపే అవకాశం ఉంది. అలా ఆయనకు బెయిలు రాకుండా కూటమి ప్రభుత్వం పన్నాగాలు పన్నుతోందని వైసీపీ ఆరోపిస్తోంది. అయితే అదేం లేదని.. చట్టం తన పని తాను చేసుకుపోతోందని టీడీపీ చెబుతోంది. ఇదే విషయాన్ని గతంలో మంత్రులు లోకేశ్​, అనిత స్పష్టం చేశారు. దళితుడిని కిడ్నాప్​చేయడానికి యత్నించినందుకే ఆయనను అరెస్టు చేశారని తెలిపారు. ఇందులో కక్ష సాధింపు లేదని చెబుతున్నారు.

Next Story

Most Viewed