కొత్త భక్తుడికి పంగనామాలెక్కువ ! : పవన్ పై ప్రకాశ్ రాజ్ మరో ట్వీట్

by Y. Venkata Narasimha Reddy |
కొత్త భక్తుడికి పంగనామాలెక్కువ ! : పవన్ పై ప్రకాశ్ రాజ్ మరో ట్వీట్
X

దిశ, వెబ్ డెస్క్ : తిరుమల లడ్డూ కల్తీ వివాదం నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, నటుడు ప్రకాశ్ రాజ్ ల మధ్య ట్విటర్ వేదికగా డైలాగ్ వార్ కొనసాగుతోంది. జస్ట్ ఆస్కింగ్ అంటూనే ప్రకాశ్ రాజ్ ఎక్స్‌లో పవన్ పై వరుస పోస్ట్‌లతో విమర్శల దాడి చేస్తున్నారు. తాజాగా పవన్ ను ఉద్దేశించి ప్రకాశ్ రాజ్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. కొత్త భక్తుడికి పంగనామాలెక్కువ ! .. కదా ? ఇక చాలు..ప్రజల కోసం చెయ్యవలసిన పనులు చూడండంటూ డిప్యూటీ సీఎం పవన్ కు వ్యంగోక్తితో కూడిన హితవు చేశారు. ఇప్పటికే పవన్ కు వ్యతిరేకంగా ప్రకాశ్ రాజ్ చేస్తున్న విమర్శల పట్ల మండిపడుతున్న పవన్ ఫ్యాన్స్ ప్రకాశ్ రాజ్ తాజా ట్వీట్ తో అతడిపై మరింత రగిలిపోతున్నారు. మరి ప్రకాష్ రాజ్‌ ట్వీట్ పై మళ్లీ పవన్ స్పందిస్తారా లేదంటే ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేస్తారా అనేది చూడాలి.

కల్తీ లడ్డు వివాదం తర్వాత పవన్ కళ్యాణ్ చేసిన ఘాటు వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ సోషల్ మీడియా వేదికగా వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. ఇప్పటికే ఇది జాతీయ స్థాయి వివాదం అన్నట్టుగా మాట్లాడొద్దని ట్వీట్ చేసిన ప్రకాష్ రాజ్ కి విజయవాడలో అమ్మ వారిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పారు. ఇది తమ మనోభావాలకు చెందిన అంశమని, "ఆయనతో పాటు అందరికీ చెబుతున్నాను.. విమర్శలు చేసే ముందు ఏం జరిగిందో తెలుసుకుని మాట్లాడండి. సనాతన ధర్మం గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదు. కరెక్ట్ గా మాట్లాడితే మాట్లాడండి, లేదంటే మౌనంగా ఉండండి" అంటూ కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత ప్రకాష్ రాజ్ "ఆవేశం వద్దు... నేను చేసిన పోస్ట్ ని మళ్లీ చదువు, ప్రస్తుతం షూటింగ్ లో ఉన్నాను. తిరిగి వచ్చాక మాట్లాడదాం" అంటూ హితవు పలికాడు. మరోసారి ఆయన "ప్రజల మనోభావాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధిని పొందడం కావాలా మనకు ? లేక ప్రజల మనోభావాలు గాయపడకుండా..‌ పరిపాలనా సంబంధమైన..‌ అవసరమైతే తీవ్రమైన చర్యలతో సున్నితంగా సమస్యను పరిష్కరించుకోవటమా? జస్ట్ ఆస్కింగ్" అంటూ పోస్ట్ చేశారు. ఇప్పుడు కొత్త భక్తుడికి పంగనామాలెక్కువ ! అంటూ మరోసారి విమర్శలు చేశారు.

ప్రకాష్ రాజ్‌, పవన్‌ కళ్యాణ్ గతంలో కలిసి పలు సినిమాల్లో నటించారు. ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు ఉండేవి. మా అసోసియేషన్ ఎలక్షన్స్ లో కూడా మెగా ఫ్యామిలీ మొత్తం ప్రకాష్ రాజ్ కే సపోర్ట్ చేసింది. అలాగే ఒక సందర్భంలో పవన్ కళ్యాణ్ పై మంచు విష్ణు కామెంట్స్ కు గట్టిగానే సమాధానం చెప్పాడు ప్రకాష్ రాజ్. అలాంటిది తాజాగా లడ్డూ గొడవ కారణంగా వీళ్లిద్దరి మధ్య పరిస్థితి ఉప్పు, నిప్పు అన్నట్టుగా మారింది. ఇప్పుడు ఇద్దరి మధ్య రాజకీయ పరమైన విభేదాలు ఉన్నాయి. ప్రకాష్ రాజ్ చాలా కాలంగా ప్రధాని మోదీ సహా బీజేపీ భావజాలాన్ని విభేదిస్తూ వస్తున్నారు. ఇప్పుడు మోదీ కూటమిలో పవన్‌ ఉన్న విషయం తెల్సిందే. అందుకే పవన్ నూ ప్రకాష్ రాజ్ విమర్శిస్తూ ఉన్నారు. ఈ వ్యవహారం ఎక్కడి వరకు దారి తీస్తుందో చూడాలి.

Next Story