AP News:పెరుగుతున్న సీజనల్ వ్యాధులు..అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు

by Jakkula Mamatha |   ( Updated:2024-08-28 15:25:10.0  )
AP News:పెరుగుతున్న సీజనల్ వ్యాధులు..అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో వైరల్ జ్వరాలు, డయేరియా తదితర లక్షణాలతో వేలాది మంది బాధపడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో వేలాది మంది చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో సీజనల్ వ్యాధుల నియంత్రణపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ నిన్న(మంగళవారం) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల వైద్యాధికారులు, సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. డెంగ్యూ, మలేరియా, డయేరియా తదితర సీజనల్ వ్యాధులకు సంబంధించి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఈ క్రమంలో అవసరమైన మందులు అందుబాటులో ఉండే విధంగా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఆసుపత్రుల్లో పారిశుద్ధ్యం, పర్యావరణ పరిశుభ్రత పైన జాగ్రత్తలు తీసుకోవాలి. దీనికి సంబంధించి పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలని, ఉమ్మడి ప్రణాళికతో ముందుకు వెళ్లాలని చెప్పారు. మురుగు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, ఆయిల్ బాల్స్ వేసి దోమల పెరుగుదలను అరికట్టే చర్యలు తీసుకోవాలని సూచించారు. గిరిజన ప్రాంతాల్లో దోమ తెరల పంపిణీ, వాడకంపై పలు సూచనలు చేశారు.

Advertisement

Next Story