టీడీపీలో కీలకంగా యువనేత: గేమ్ ఛేంజర్‌గా నారా లోకేశ్

by Seetharam |
టీడీపీలో కీలకంగా యువనేత: గేమ్ ఛేంజర్‌గా నారా లోకేశ్
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారా? తండ్రి చంద్రబాబు జైలుకెళ్లిన తర్వాత రాజకీయాన్ని అవపోశనం పట్టారా? రాజకీయ దురంధురిడిగా.. వెల్ అడ్మినిస్ట్రేటర్‌గా గుర్తింపు పొందిన చంద్రబాబుకు తగ్గ తనయుడుగా లోకేశ్ మారనున్నారా? టీడీపీ వారసుడిగా తానేంటో నిరూపించుకునేందుకు రెడీ అవుతున్నారా? తండ్రి కంటే మెరుగైన లీడర్ అనిపించుకునేందుకు ఆచితూచి వ్యవహరిస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నారా లోకేశ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. ఎమ్మెల్సీగా ఎంపికై ఏకంగా తండ్రి కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు. ఐటీ శాఖ మంత్రిగా ఉంటూ యువతకు ఉద్యోగాల కల్పనలో అగ్రస్థానంలో నిలిచారు లోకేశ్ అన్నది అతిశయోక్తి కాదు. రాష్ట్ర అభివృద్ధిలో తన శాఖలతో మమేకం అవుతున్నప్పటికీ లోకేశ్‌పై తీవ్ర విమర్శలు ఉన్నాయి. దొడ్డిదారిన ఎమ్మెల్సీ అయి మంత్రి అయ్యారంటూ వైసీపీ చేసిన విమర్శలకు తన పనితో ముక్కున వేలేసుకునేలా లోకేశ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే 2019 ఎన్నికల్లో మంగళగిరి నుంచి ఓటమి పాలైన తర్వాత వైసీపీ లోకేశ్‌ను టార్గెట్ చేసింది. లోకేశ్‌ బాడీని షేమింగ్ చేస్తూ వ్యక్తిగతంగా విమర్శలు చేసింది. అంతేకాదు వైసీపీ సోషల్ మీడియా అయితే మరీ దారుణంగా లోకేశ్‌ను ట్రోల్ చేసింది. అయినప్పటికీ లోకేశ్ బెదిరిపోలేదు. వెనక్కి తగ్గలేదు. నిత్యం ప్రజల్లో ఉంటూ తానేంటో నిరూపించుకునేందుకు రెడీ అయ్యారు. ఒకప్పుడు లోకేశ్‌కు ఏమీ తెలియదని విమర్శించే నాయకులు నేడు లోకేశ్‌కనుసన్నుల్లోనే అంతా అనిపించుకునేలా మారిపోయాడు. దీంతో ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో నారా లోకేశ్ హాట్ టాపిక్‌గా మారారు. లోకేశ్ వ్యూహం.. రాజకీయ ఎత్తుగడలపై ఆసక్తికర చర్చ జరుగుతుంది.

అడ్డంకులను సైతం అధిగమిస్తూ

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నారా లోకేశ్ ఇప్పుడు సెంట్రాఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఒక్కడే అన్నీ తానై నిలుస్తున్నారు. 2014 ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన లోకేశ్ 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలవ్వడంతో లోకేశ్ ఒక్కసారిగా నిరాశ చెందారు. అయినప్పటికీ రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం అని గ్రహించిన లోకేశ్ రెట్టింపు ఉత్సాహంతో పనిచేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో మమేకం అవుతూ ముందుకు నడిచారు. ముఖ్యంగా వైసీపీ హయాంలో టీడీపీ నాయకులపై దాడులు, టీడీపీ నేతల హత్యకు గురైన ఘటనలో వారికి కొండంత అండగా నిలిచారు. బాధితులను పరామర్శించేందుకు లోకేశ్‌ను వెల్లనీయకుండా అధికార పార్టీ అడ్డుపడినప్పటికీ కేసులు పెట్టినప్పటికీ లోకేశ్ ఏమాత్రం వెనకడుగు వేయలేదు. ఎన్ని అవాంతరాలు ఎదురైనప్పటికీ తమ పార్టీకోసం నిలిచిన వారికి కొండంత అండగా నిలిచారు నారా లోకేశ్. అంతేకాదు యువత ఉద్యోగాలు లేక తల్లడిల్లిపోతున్న తరుణంలో వారి ఇబ్బందులను తెలుసుకున్న లోకేశ్ రాష్ట్రంలో యువతలో రాజకీయ చైతన్యం తీసుకువచ్చేందుకు యువగళం పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ యువగళం పాదయాత్ర ప్రారంభంలో కూడా వైసీపీ తీవ్ర విమర్శలు చేసింది. పది కిలోమీటర్లు కూడా నడవలేరని.. పాదయాత్ర కాదు వాకింగ్ అని ఎన్నో విమర్శలు చేసింది వైసీపీ. వాటన్నింటిని తట్టుకున్న నారా లోకేశ్ ఏకంగా రాయలసీమలో పాదయాత్రను పూర్తి చేసి అందరి నోటా ఔరా అనిపించుకున్నారు. పాదయాత్రలో పోలీసులతో వైసీపీ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు సృష్టించినా లోకేశ్ వెనకడుగు వేయలేదు. అన్నింటిని భరించారు. మూల్యం చెల్లించుకోక తప్పదు అని హెచ్చరించారు. అలా కోస్తాంధ్ర వరకు యువగళం పాదయాత్రను చేస్తూ చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో తాత్కాలికంగా విరామం పలికారు నారా లోకేశ్.

అన్నీ తానై వ్యవహరిస్తున్న లోకేశ్

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లిన తర్వాత నారా లోకేశ్‌ రాజకీయాల పట్ల పూర్తి అవగాహన తెచ్చుకున్నారు. తండ్రి ఒక పార్టీ అధినేతగా చూస్తున్న బాధ్యతలను తెలుసుకున్న నారా లోకేశ్ ఆ బాధ్యతలను స్వయంగా పర్యవేక్షించారు. ఒకప్పుడు లోకేశ్ జీరో అనే స్థాయి నుంచి ఆల్ రౌండర్ అనిపించుకునేలా అన్నీ తానై టీడీపీలో వ్యవహరించారు. తండ్రి జైల్లో ఉన్నప్పుడు పార్టీ శ్రేణులు నిరాస నిస్పృహలకు గురి కాకుండా ఉండేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టారు నారా లోకేశ్. చంద్రబాబు నాయుడు అరెస్ట్‌కు నిరసనగా చేపట్టిన కార్యక్రమాలతో ప్రజలతో కలిసి పాల్గొనేవారు. అదే సమయంలో నారా లోకేశ్‌ను సీఐడీ పలు కేసుల్లో నిందితుడిగా చేర్చి కోర్టుల్లో పిటిషన్లు వేయడం.. సీఐడీ నోటీసులు ఇచ్చినప్పటికీ నారా లోకేశ్ మెుక్కవోని దీక్షతో పార్టీ కార్యక్రమాలు.. కార్యకర్తలను సమన్వయ పరచుకోవడంలో సక్సెస్ అయ్యారు. ఒకవైపు కుటుంబానికి పెద్దదిక్కుగా వ్యవహరిస్తూనే మరోవైపు పార్టీకి కొండంత అండగా నిలిచారు. మరోవైపు తండ్రి చంద్రబాబు నాయుడును బెయిల్‌పై తీసుకువచ్చేందుకు ఢిల్లీ వేదికగా న్యాయనిపుణులతో చర్చలు జరిపేవారు. చివరకు ఆ విషయంలో కూడా సక్సెస్ అయ్యారు. తండ్రి చంద్రబాబు నాయుడును రెగ్యులర్ బెయిల్ తెప్పించుకోవడంలో సఫలీకృతమయ్యారు. తన తండ్రి స్కిల్ డవలప్‌మెంట్ స్కీమ్ లో ఎలాంటి స్కాంలకు పాల్పడలేదని బలంగా వాదించారు. అందుకు తగ్గ సాక్ష్యాధారాలను ప్రజలకు న్యాయస్థానాలకు తెలియజేయడంలో లోకేశ్ ఒకవిధంగా సక్సెస్ అయ్యారనే చెప్పాలి.

యువతతో ప్రత్యేక కార్యక్రమం

స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు నాయుడుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు కావడంతో నారా లోకేశ్ దూకుడు పెంచారు. ఎక్కడైతే నిలిచిపోయిందో అక్కడ నుంచే యువగళం పాదయాత్రను చేపట్టేందుకు రెడీ అవుతున్నారు. అలాగే ప్రజల్లోకి యువ నాయకులను రంగంలోకి దించాలని లోకేశ్ ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఒక కొత్త కార్యక్రమాన్ని రూపొందించేందుకు లోకేశ్ వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా యువ నాయకులు అయిన ఎంపీ రామ్మోహన్ నాయుడు, చింతకాయల విజయ్, పరిటాల శ్రీరామ్, ఉండవల్లి అనూష, కావలి గ్రీష్మ, గంటి హరీశ్ మాధుర్, ఆదిరెడ్డి వాసు, గాలి భాను ప్రకాశ్, బండారు సత్యనారాయణ మూర్తి తనయుడులతో కలిసి ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించనున్నట్లు తెలుస్తోంది. వీరంతా కలిసి ఎన్నికల సమయంలో రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తారని యువతకు టీడీపీ అధికారంలోకి వస్తే ఏం చేయబోతుందో అనే దానిపై పర్యటించేలా కార్యక్రమాన్ని రూపొందించే పనిలో లోకేశ్ నిమగ్నమైనట్లు తెలుస్తోంది.

జై కొడుతున్న నాయకత్వం

ఇదిలా ఉంటే నారా లోకేశ్ టీడీపీ-జనసేన పార్టీల మధ్య సమన్వయాన్ని స్వయంగా పర్యవేక్షిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే ఇరుపార్టీల ఉమ్మడి సమావేశంలో పాల్గొన్న నారా లోకేశ్ దాంట్లో కూడా కీలకంగా మారనున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే టికెట్ల కేటాయింపు వ్యవహారంలో కూడా తన వంతు పాత్ర పోషిస్తారని తెలుస్తోంది. ఈసారి వచ్చే ఎన్నికల్లో యువతకు 40 శాతం టికెట్ల కేటాయిస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో ఆ హామీని నెరవేర్చేందుకు లోకేశ్ శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తారని తెలుస్తోంది. మెుత్తానికి టీడీపీలో లోకేశ్ వ్యవహరిస్తున్న తీరుకు ఆ పార్టీలో యువ నాయకులతోపాటు పార్టీ నాయకత్వం సైతం జై కొడుతున్నట్లు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది.

Advertisement

Next Story