అత్తాకోడళ్ల పై లైంగికదాడి దారుణం.. హోంమంత్రి అనిత కీలక వ్యాఖ్యలు

by Jakkula Mamatha |   ( Updated:2024-10-15 08:38:39.0  )
అత్తాకోడళ్ల పై లైంగికదాడి దారుణం.. హోంమంత్రి అనిత కీలక వ్యాఖ్యలు
X

దిశ, ఏపీ బ్యూరో: శ్రీ సత్యసాయి జిల్లాలో అత్తాకోడళ్లపై లైంగిక దాడి ఘటనలో నిందితులను 48 గంటల్లోనే పోలీసులు పట్టుకున్నారని రాష్ట్ర హోం మంత్రి అనిత తెలిపారు. నిందితులకు వేగంగా శిక్ష పడాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించినట్లు పేర్కొన్నారు. దీనిపై విచారణను ప్రత్యేక కోర్టుకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నామన్నారు. అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో అనిత మాట్లాడుతూ సీసీ కెమెరాల ద్వారా నిఘా పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని, దీనిలో ప్రజల భాగస్వామ్యం ఉండాలని కోరుతున్నామని ఆమె పేర్కొన్నారు. ఇళ్లు, వాణిజ్య సముదాయాల వద్ద పెట్టుకున్న సీసీ కెమెరాలను పోలీసు శాఖకు అనుసంధానం చేస్తే నేర నియంత్రణ సాధ్యమవుతుందన్నారు.

పోలీసులకు ఆయుధాల్లాగే ప్రజలకు మొబైల్ ఫోన్లు ఉన్నాయని, వాటిని వినియోగించి నేర నియంత్రణకు సహకరించాలని కోరారు. సమాచారం ఇచ్చే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని, మహిళల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందన్నారు. శ్రీసత్యసాయి జిల్లాలో జరిగిన ఘటనలో ఐదుగురు నిందితులను పట్టుకోగా వారిలో ఒకరి పై 87 కేసులు ఉన్నాయన్నారు. ఆ నిందితుడిపై అత్యాచార ఆరోపణలు ఉన్నాయని, అందుకే త్వరితగతిన విచారణకు ఈ కేసును ప్రత్యేక కోర్టుకు అప్పగిస్తున్నామని తెలిపారు. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని హోం మంత్రి అనిత అన్నారు.

Next Story

Most Viewed