వైసీపీలో దళిత మంత్రులు, ఎమ్మెల్యేలకు ఆత్మాభిమానం లేదు: మాజీమంత్రి నక్కా ఆనందబాబు

by Seetharam |   ( Updated:2023-10-25 13:07:16.0  )
వైసీపీలో దళిత మంత్రులు, ఎమ్మెల్యేలకు ఆత్మాభిమానం లేదు: మాజీమంత్రి నక్కా ఆనందబాబు
X

దిశ, డైనమిక్ బ్యూరో : జగన్ పాలనలో 27 మంది దళిత ఎమ్మెల్యేలున్నా దళితుల బాగు కోసం ఏవిధంగాను సహకరించడంలేదు అని మాజీమంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. జగన్ రెడ్డి ప్రభుత్వం సామాజిక సాధికార బస్సు యాత్రలు దేనికి? చేస్తోందో అర్థం కావడంలేదన్నారు. అసలు జగన్ కు సామాజిక సాధికారత అంటే అర్థం తెలుసా? అని ప్రశ్నించారు. దళిత మంత్రులు, నాయకులకు ఇన్నాళ్లు సామాజిక సాధికారత గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు. గతంలో దేశంలో ఎస్సీ, ఎస్టీ వర్గాలు అణచివేతకు గురౌతున్నాయని, అంటరానితనం, అస్పశ్యతల మధ్య కొట్టుమిట్టాడుతుంటే బీఆర్ అంబేద్కర్ వారికి రాజ్యాంగం ప్రకారం ప్రత్యేక హక్కులు, రాయితీలు, రిజర్వేషన్ లు కల్పించారు అని చెప్పుకొచ్చారు. కేంద్రంలో గానీ, రాష్ట్రంలో గానీ అధికారంలోకి వచ్చే ప్రభుత్వాలు రాజ్యంగం ద్వారా సంక్రమించిన హక్కుల్ని దళితులు, గిరిజనులకు కల్పిస్తూ వచ్చారన్నారు. అణగారిన వర్గాలను ఉన్నత వర్గాలతో సమానంగా చేయడమే సాధికారత అని చెప్పుకొచ్చారు. ‘వైసీపీ ప్రభుత్వంలో సామాజిక సాధికారత లేదు అని చెప్పుకొచ్చారు. వైసీపీ ప్రభుత్వం సాధికారత సాధించే దిశగా ఎప్పుడూ పోలేదు. అందుకు ఏ ఒక్క పథకం అమలు చేయలేదు. రాష్ట్రంలో సాంఘీక సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ లను సాధికారత సాధించే దిశగా చంద్రబాబు హయాంలో ప్రయత్నించారు. ఆ శాఖలకు ఎంపోరిం యాడ్ చేశారు. వరి అభ్యన్నతికి అనేక పథకాలను తీసుకొచ్చారు. నేడు వాటిని పూర్తిగా తుంగలో తొక్కారు. సామాజిక న్యాయాన్ని అటెక్కించారు. సామాజిక న్యాయానికి నిట్టనిలువునా గొంతు కోశారు. దగా చేశారు’ అని మాజీమంత్రి నక్కా ఆనందబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

కులాలవారీగా బడ్జెట్

వైసీపీ దళిత మంత్రులు, ఎమ్మెల్యేలకు ఆత్మాభిమానం లేదు అని మాజీమంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. అమ్మఒడి, స్కాలర్ షిప్‌లు గతంలోనూ టీడీపీ ప్రభుత్వం ఇచ్చింది అని చెప్పుకొచ్చారు. టీడీపీ హయాంలోని ఫ్రీ స్కాలర్ షిప్ పథకమే విద్యాదీవెన పథకం అని చెప్పుకొచ్చారు. గతంలో టీడీపీ ప్రభుత్వం హాస్టళ్లకు ఇచ్చే మెస్ ఛార్జీలు, అకామడేషన్ బిల్లులకు పేరు మార్చి వసతి దీవెన అంటున్నారని చెప్పుకొచ్చారు. రాష్ట్ర బడ్జెట్ ను విడగొట్టారు. కులాలవారీగా వేరు చేశారు. తెల్ల రేషన్ కార్డుపై రూపాయికి కిలో బియ్యం ఇచ్చే పథకంలో కూడా కులాలవారీగా కార్డులెన్ని ఉన్నాయో లెక్కేసి ఏ కులానికి ఎన్ని కోట్లు ఇస్తున్నామనేది ప్రభుత్వం ప్రజలకు చూపుతోంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎస్సీ కులంలో పుట్టి, ఎస్సీలుగా ఉండి ఎస్సీలకు అన్యాయం చేస్తున్నారు అని మండిపడ్డారు. టీడీపీ హయాంలో బెస్ట్ అవైలబుల్ స్కూళ్ల ద్వారా 70 వేల మందికి లబ్ధి చేకూర్చాం అని చెప్పుకొచ్చారు. అయితే ఈ ప్రభుత్వం బెస్ట అవైలబుల్ స్కూళ్లను రద్దు చేసింది అని మాజీమంత్రి నక్కా ఆనందబాబు చెప్పుకొచ్చారు.

మర్డర్ చేసిన అనంత్ బాబుకు రెడ్ కార్పెట్

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు తన వద్ద డ్రైవర్ గా పనిచేసే సుబ్రమణ్యం అనే దళితుడిని చంపేసి శవాన్ని తీసుకెళ్లి డోర్ డెలివరి చేస్తే మొక్కుబడిగా పార్టీ నుండి సస్సెండ్ చేశామని చెప్పి రాచ మర్యాదలతో జైలునుంచి తీసుకొచ్చారు. అతనికి రెడ్ కార్పెట్ పరిచారు. ముఖ్యమంత్రి నిర్వహించే లెజిస్లేచర్ పార్టీ సమావేశాల్లో, తూర్పు గోదావరి జిల్లాలో ముఖ్యమంత్రి నిర్వహించిన సమావేశాల్లో చెట్టాపట్టాలేసుకుని తిరిగారన్నారు. మరోవైపు ఇసుక మాఫియాను ప్రశ్నించినందుకు వరప్రసాద్ ను శిరోముండనం చేశారు అని ఆరోపించారు. అమరావతి రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులు ఆందోళన చేస్తుంటే వారి చేతులకు బేడీలు వేసి నడిపించారు.పైగా వారిమీదే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు అని మాజీమంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. ఎస్సీ, ఎస్టీ యాక్టును అడ్డగోలుగా నిర్వీర్యం చేసినవారు సాధికారత గురించి మాట్లాడటమా? అని ప్రశ్నించారు. వైసీపీలోని దళిత ఎమ్మెల్యేలు, మంత్రులు ఆత్మగౌరవంగా బతకాలి. ప్రతిపక్షాల గొంతు నులమడం సరికాదు. చంద్రబాబునాయుడును జైల్లో పెట్టడంతో గొప్ప విజయం సాధించినట్లుగా స్వీట్లు పంచుకోవడం, బాణాసంచ కాల్చుకోవడం, పండుగ చేసుకోవడం సైకోయిజానికి నిదర్శనం. తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడు పేద, బడుగు వర్గాల పక్షాన ఉంటుంది. నరకాసుర వధ మొదలైంది. కంటిన్యూ అవుతుంది. వైసీపీకి సమయం దగ్గరపడింది. ఏ దళితులను వంచించారో ఆ దళితులే వైసీపీకి బుద్ది చెబుతారని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు తెలిపారు.

Advertisement

Next Story