నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. కేంద్రం కరుణించేనా?

by Y.Nagarani |   ( Updated:2024-10-07 02:04:32.0  )
నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. కేంద్రం కరుణించేనా?
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. రెండ్రోజులపాటు ఆయన ఢిల్లీలోనే పర్యటించనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగే వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశానికి హాజరవుతారు. అనంతరం ప్రధాని నరేంద్రమోదీతో పాటు కేంద్రమంత్రుల దృష్టికి.. ఏపీలో పూర్తిచేయాల్సిన ప్రాజెక్టులు, రావల్సిన నిధుల విషయాలను తీసుకెళ్లనున్నారు.

విజయవాడలో సంభవించిన వరదల తర్వాత.. తొలిసారి ప్రధానితో భేటీ కానున్నారు చంద్రబాబు. సాయంత్రం 4.30 గంటలకు ప్రధాని మోదీతో సమావేశమై వరదల కారణంగా వాటిల్లిన నష్టం, ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులపై నివేదికను అందించనున్నారు. రాష్ట్రానికి రావలసిన వరద సహాయం నిధులు, విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుతో పాటు.. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో విశాఖ ఉక్కు విలీనం వంటి కీలక అంశాలపై చర్చించనున్నారు.

రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధికై కేంద్రం మద్దతుతో ప్రపంచ బ్యాంకు రూ.15 వేల కోట్ల రుణం మంజూరు చేయగా.. దానిపై కూడా ప్రధానితో చర్చించనున్నారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి తొలివిడతగా ఇస్తామన్న రూ.12 వేల కోట్ల నిధులు ఎలాంటి ఆటంకం లేకుండా రాష్ట్రానికి వచ్చేలా చూడాలని కోరనున్నట్లు సమాచారం. రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తోనూ భేటీ అయ్యి రాష్ట్రంలో పూర్తి చేయాల్సిన రైల్వే ప్రాజెక్టులపై చర్చించనున్నారు.

రేపటి పర్యటన ఇలా..

రేపు (అక్టోబర్ 8, మంగళవారం) హోంమంత్రి అమిత్ షా తో సమావేశవై పలు కీలక అంశాలపై చర్చిస్తారు. అనంతరం కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లతో భేటీ కానున్నారు. కేంద్రం నుంచి రావలసిన నిధులు వస్తేనే కూటమి సర్కార్ కు సూపర్ సిక్స్ పథకాల అమలు సాధ్యమవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.

Advertisement

Next Story