తిరుపతి ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రతి ఇంట జరుపుకుందాం.. తిరుపతి ఎమ్మెల్యే భూమన పిలుపు

by Javid Pasha |
తిరుపతి ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రతి ఇంట జరుపుకుందాం.. తిరుపతి ఎమ్మెల్యే భూమన పిలుపు
X

దిశ, తిరుపతి: ప్రపంచ ప్రసిద్ధి గాంచిన తిరుమల వెంకటేశ్వర స్వామి పాదాల చెంత చరిత్ర పుటలలో లిఖించబడిన కొత్తూరు (కోటపల్లి) నామాలతో మార్పు చెంది చివరకు తిరుపతిగా ఫిబ్రవరి 24వ తేదీ 1130 వ సంవత్సరం ఆవిర్భవించిందని స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి గత తిరుపతి చరిత్రను గుర్తు చేశారు. మంగళవారం స్థానిక సింధూరి హోటల్ లో తిరుపతి విశిష్టతను తెలిపే కరపత్రాలను ఎమ్మెల్యే విడుదల చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ పండుగను తిరుపతి నగరంలోని ప్రతి ఇంట జరుపుకోవాలని పిలుపునిచ్చారు. తిరుపతి నగర పుట్టిన రోజుకు రాజకీయ రంగు పులమొద్దని కోరారు. ఫిబ్రవరి 24 తేదీ, 1130 లో తిరుపతి నగరం పుట్టిందన్నారు.

తిరుపతి నగరంలో జన్మించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామన్నారు. 893వ జన్మ దినోత్సవాలను అందరం కలిసి ఆనందంగా జరుపుకుందామన్నారు. ఆ కాలంలో శ్రీవారి ఆలయం కూడా తిరుచానూరులో ఉండేదని, బ్రహ్మోత్సవాలన్నీ అక్కడే జరిగేవని ఎమ్మెల్యే తెలిపారు. భగవత్ రామానుజులు తిరుపతి పట్టణ ఆవిర్భావానికి కారకులని, అందులో భాగంగానే గోవిందరాజ పట్టణం వెలసిందని తెలిపారు. 13వ శతాబ్దం నుండి తిరుపతిగా ప్రసిద్ధిగాంచిందని, నాటినుండి నేటి వరకు తిరుపతి విశ్వ వ్యాప్తమైందని కొనియాడారు.

అనంతరం గోవిందరాజ స్వామి ఆలయానికి చేరుకొని పెద్ద జీయర్, చిన్నజీయర్ స్వాములకు వేడుకలకు రావాలని ఆహ్వానాలు అందించారు. ఈ సమావేశంలో నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష , ఉపమేయర్ ముద్ర నారాయణ, కార్పొరేటర్లు రామస్వామి వెంకటేశ్వర్లు, నరసింహ చారి, ఎస్కే బాబు, కోఆప్షన్ సభ్యులు వెంకటరెడ్డి, టౌన్ బ్యాంకు మాజీ చైర్మన్ తొండం నాటి వెంకటేశ్వర్, శ్రీ సిటీ మేనేజర్ రామచంద్రారెడ్డి, ప్రముఖ రచయితలు శైల కుమార్, శాకం నాగరాజు, వెంకటేష్ రాయల్లు పాల్గొన్నారు.

Next Story

Most Viewed