TTD:అన్నప్రసాదాలకు నాణ్యమైన బియ్యం సరఫరా చేయాలి :టీటీడీ ఈవో

by Jakkula Mamatha |
TTD:అన్నప్రసాదాలకు నాణ్యమైన బియ్యం సరఫరా చేయాలి :టీటీడీ ఈవో
X

దిశ,తిరుమల:తిరుమలకు విచ్చేసే వేలాదిమంది భక్తులకు అందించే అన్నప్రసాదాల రుచిని పెంచేందుకు నాణ్యమైన బియ్యం సరఫరా చేయాలని టీటీడీ ఈవో జె. శ్యామల రావు రైస్ మిల్లర్లను కోరారు. తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలో సమావేశ మందిరంలో టీటీడీకి బియ్యం సరఫరా చేస్తున్న రైస్‌మిల్లర్లతో బుధవారం ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు బియ్యం సేకరణ సమయంలో నాణ్యత ప్రమాణాలను పెంపొందించడంలో దోహదపడే అంశాలను ఇవ్వాలని కోరారు.

తద్వారా టెండర్లకు ఆహ్వానించే సమయంలో వాటిని చేర్చవచ్చు అన్నారు. అన్నం రుచిని పెంపొందించేందుకు రైస్ మిల్లర్స్ పలు సూచనలు చేశారు. ఇందులో ముఖ్యంగా మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదంలో వంట పరికరాలు దశాబ్దంన్నర కాలం నాటివి కావడంతో వాటి స్థానంలో అత్యాధునిక యంత్రాలను ఏర్పాటు చేయాలని ఈవో దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు ఈవో స్పందిస్తూ ఇప్పటికే టీటీడీ ఈ విషయమై ఆలోచన చేసిందని, త్వరలో వంటశాలలను ఆధునీకరించనున్నట్లు ఈవో తెలిపారు.ఈ సమావేశంలో జేఈవోలు శ్రీమతి గౌతమి, వీరబ్రహ్మం, అన్నప్రసాదం డిప్యూటీ ఈవో రాజేంద్ర కుమార్, ప్రత్యేక అధికారి (కేటరింగ్) శాస్త్రి, ఈఈ ప్రొక్యూర్‌మెంట్ మురళీకృష్ణ, ఏపీ, తెలంగాణ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.

Read More..

Tirumala News:శ్రీవారిని దర్శించుకున్న పాలిమర్ మఠాధిపతి



Next Story