చంద్రబాబు ఇంకో 15ఏళ్లు బతకాలి..పొట్టేళ్లు నరకడం హేయం: ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి

by Seetharam |
చంద్రబాబు ఇంకో 15ఏళ్లు బతకాలి..పొట్టేళ్లు నరకడం హేయం: ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ స్కాం కేసులో మధ్యంతర బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే. చంద్రబాబు నాయుడు మధ్యంతర బెయిల్‌పై వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు కేవలం మెడికల్‌ గ్రౌండ్స్‌ కింద కోర్టు కండీషన్‌ బెయిల్‌ ఇచ్చింది అని చెప్పుకొచ్చారు. ‘న్యాయం గెలిచింది’ అని చెప్పే తెలుగుదేశం వారిని అడుగుతున్నా.... న్యాయం గెలిచిందా? రోగం గెలిచిందా?’’ అంటూ రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి నిలదీశారు. అనంతపురం ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో బుధవారం ఎమెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కండీషన్‌ బెయిల్‌పై చంద్రబాబు విడుదలైతే టీడీపీ శ్రేణులు బాణసంచా కాల్చడం విడ్డూరంగా ఉందన్నారు. ఇంకా కొందరైతే పొట్టేళ్లు నరకడం, జంతు బలి చేయడం చూస్తే సభ్యసమాజం తలదించుకునేలా హేయమైన చర్యలకు పాల్పడడం చాలా బాధాకరమన్నారు. అనేక దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న చంద్రబాబు క్యాంట్రాక్ట్‌ ఐ సర్జరీ చేసుకోవాల్సిన అవసరం ఉందని వైద్యులు ధ్రువీకరణపత్రం ఇవ్వడంతో 28 రోజుల పాటు బెయిల్‌ ఇచ్చారని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఇకపోతే రాప్తాడు నియోజకవర్గంలో సభ్యసమాజం తలదించుకునేలా పొట్టేళ్లు నరికారని మండిపడ్డారు. చంద్రబాటు చిత్రప‌టానికి పొట్టేళ్ల రక్తం చిందించారని..పైగా వాటిని వీడియోలు తీసి సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు మీద ప్రేమ ఉంటే గుడికి వెళ్లి ప్రార్థనలు చేయొచ్చు. అన్నదానాలు చేయొచ్చు. స్వీట్లు పంచుకోవచ్చు. అంతేకాని ఇలా నీచాతినీచంగా వ్యవహరించారని ధ్వజమెత్తారు. మేమైతే చంద్రబాబు ఇంకో 15 ఏళ్లయినా సంపూర్ణంగా బతకాలని కోరుకుంటున్నట్లు స్పష్టం చేశారు. చంద్రబాబు చికిత్స చేయించుకుని ఆరోగ్యంగా జైలుకు వెళ్లాలని కోరుకుంటున్నట్లు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్ర‌కాశ్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

Advertisement

Next Story