‘4 వారాలే టైమ్’.. ఏపీకి బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ డెడ్ లైన్

by Satheesh |
‘4 వారాలే టైమ్’.. ఏపీకి బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ డెడ్ లైన్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న కృష్ణా జలాల పంపిణీ వివాదం మరింత ముదురుతున్నది. కృష్ణా జలాల్లో తెలంగాణ తన వాటా విషయమై స్పష్టమైన అభిప్రాయాలను స్టేట్‌మెంట్ రూపంలో ఇప్పటికే సమర్పించగా, ఏపీ ఇంతవరకూ ఇవ్వకపోవడాన్ని జస్టిస్ బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తప్పుపట్టింది. నాలుగు వారాల్లోగా సమర్పించాలంటూ మే నెలలోనే ట్రిబ్యునల్ ఆదేశించిందని, తెలంగాణ తన స్టేట్‌మెంట్ ఇచ్చినా ఏపీ జాప్యం చేయడాన్ని ఆక్షేపించింది. అసెంబ్లీ ఎన్నికల రీత్యానే ఆలస్యమైందని, ప్రభుత్వం మారడంతో అడ్వొకేట్ జనరల్, అడ్వొకేట్ ఆన్ రికార్డు మారారని, అందువల్లనే నిర్దిష్ట గడువులోగా ఇవ్వలేకపోయినట్లు ఆ రాష్ట్రం తరపున హాజరైన న్యాయవాదులు ట్రిబ్యునల్‌కు వివరించారు. ఈ కారణాన్ని ట్రిబ్యునల్ సమర్ధించలేదు.

ఏపీ తరఫున లేవనెత్తిన వాదనలు సమంజసంగా, సహేతుకంగా లేవని వ్యాఖ్యానించి నాలుగు వారాల్లోగా ఇవ్వాల్సిందేనని, ఒకవేళ ఇవ్వకపోయినట్లయితే ఇకపైన కూడా సమర్పించడానికి ఆస్కారం ఉండదని, ట్రిబ్యునల్ తన నిర్ణయాన్ని వెల్లడిస్తుందని తీవ్ర స్వరంతో వ్యాఖ్యానించింది. ఇప్పటి నుంచి నాలుగు వారాల్లోగా ఏపీ తన స్టేట్‌మెంట్‌ను ట్రిబ్యునల్‌కు సమర్పించాలని, దాన్ని తెలంగాణ పరిశీలించి అభ్యంతరాలను రెండు వారాల్లోగా ట్రిబ్యునల్‌కు తెలియజేయాలని జస్టిస్ బ్రిజేశ్‌కుమార్ స్పష్టం చేశారు. మొత్తం ఆరు వారాలను పరిగణనలోకి తీసుకుని తదుపరి విచారణను ఆగస్టు 28, 28 తేదీల్లో చేపట్టనున్నట్లు తెలిపింది. మరోవైపు ఏపీ లేవనెత్తిన వాదనలను తెలంగాణ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది వైద్యనాధన్ తప్పుపట్టారు. ఏపీ ప్రస్తావించిన కారణం నిజమే అయితే సుప్రీంకోర్టులో తెలంగాణ వేసిన పిటిషన్‌పై జరుగుతున్న వాదనలకు ఆ రాష్ట్రం తరఫున న్యాయవాదులు ఎలా హాజరవుతున్నారని ప్రశ్నించారు.

Advertisement

Next Story

Most Viewed