లోకేశ్ శకం మెుదలు: టీడీపీలో 40 శాతం టికెట్లు వారికే

by Seetharam |
లోకేశ్ శకం మెుదలు: టీడీపీలో 40 శాతం టికెట్లు వారికే
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీలో తెరవెనుక ఉంటూ రాజకీయం చేసిన నారా లోకేశ్ 20014 ఎన్నికల అనంతరం ఇక తెరపైకి వచ్చేశారు. అకస్మాత్తుగా తెరమీదకు వచ్చి పాలనలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులవ్వడమే కాదు చంద్రబాబు ప్రభుత్వంలో ఏకంగా కీలకమైన శాఖలకు మంత్రిగా పనిచేసి ఔరా అనిపించారు. ఐటీ శాఖ మంత్రిగా పనిచేస్తూ అనేక కంపెనీలు రాష్ట్రానికి తరలిరావడంలో విశేష కృషి చేశారు. పొరుగుదేశాల్లో ఉద్యోగాలు పొందాలనుకునే వారికి సైతం శిక్షణ ఇచ్చారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడంతో టీడీపీ గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయింది. అప్పటి వరకు లోకేశ్ పెత్తనాన్ని సహించలేని నేతలు తెరపైకి వచ్చి లోకేశ్ ఒంటెత్తు పోకడల వల్ల పార్టీ దెబ్బతిందని విమర్శలు సైతం చేసిన సంగతి తెలిసిందే. అన్నీ భరించిన నారా లోకేశ్ అనంతరం పరిణితి చెందారు. తెలుగు కూడా సరిగ్గా మాట్లాడలేని లోకేశ్ నేడు అనర్గళంగా తెలుగు మాట్లాడుతున్నారు. అంతేకాదు యువగళం పాదయాత్ర సక్సెస్ కావడంతో ఆయన రాజకీయ జీవిత ముఖచిత్రం గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇప్పుడు టీడీపీలో నారా లోకేశ్ అత్యంత కీలకం అయ్యేంతలా మారిపోయారు. ఎవరు ఔన‌న్నా, కాద‌న్నా టీడీపీలో లోకేశ్ శకం మెుదలైంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత పార్టీ వ్యవహారాలను చక్కదిద్దిన నారా లోకేశ్ రాబోయే రోజుల్లో టీడీపీకి అన్నీ తానై వ్యవహరిస్తారని తెలుస్తోంది. అందులో భాగంగానే తనకంటూ ఒక ప్రత్యేక టీంను ఏర్పాటు చేసుకున్నారని తెలుస్తోంది.

40 శాతం టికెట్లు యువతకే

తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు కోటరీ, నారా లోకేశ్ కోటరీలు ఉన్నాయి. సీనియర్లంతా చంద్రబాబు కోటరీ అయితే యంగ్ టీం అంతా లోకేశ్ వెంట ఉన్న సంగతి తెలిసిందే. గతంలో చాలా మంది సీనియర్ల బాట పట్టిన యువ నాయకులు సైతం ఇప్పుడు లోకేశ్ వెంట నడుస్తున్నారు. అచ్చెన్నాయుడు దగ్గర నుంచి నిమ్మకాయల చినరాజప్ప, అయ్యన్నపాత్రులులాంటి నేతలు సైతం లోకేశ్‌కు జై కొడుతున్న సంగతి తెలిసిందే. టీడీపీలో యువరక్తం కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో లోకేశ్ 40 శాతం టికెట్లు యువతకే ఇవ్వాలని నిర్ణయించారు. ఇందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతోపాటు టీడీపీ పొలిట్ బ్యూరో సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. యువతకే అత్యధిక ప్రాధాన్యత ఉంటుందని... సీనియర్లకు నామినేటెడ్ పదవులు ఇవ్వనున్నట్లు ప్రకటించేసింది. ఇందులో భాగంగా లోకేశ్‌ కోటరీలో చేరేందుకు అటు యువ నాయకులే కాదు సీనియర్లు సైతం పోటీపడుతున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో నారా లోకేశ్‌ టీం ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించబోతుందని తెలుస్తోంది.

గెలుపు గుర్రాలకే టికెట్లు

ఇదిలా ఉంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలని తీర్మానించారు. ప్రస్తుతం జనసేనతో పొత్తులోఉన్నాం కాబట్టి టికెట్ల కేటాయింపులో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుందని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో గెలిచేవాళ్లకే టికెట్ ఇస్తానని తెలిపారు. అంతేకాదు ప్రజాభిప్రాయ సేకరణ సైతం చేస్తున్నామని.. ప్రజామోదం కలిగిన వారికి టికెట్ తప్పక ఇస్తామని ప్రకటించారు. క్షేత్రస్థాయిలో ప్రజాదరణ లేని నాయకులను పక్కనపెట్టి పార్టీకి ఉపయోగించుకుంటామని తెలిపారు. చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు సరైనవే. కానీ గెలుపుగుర్రాలకే టికెట్లు అని ప్రకటించడంతో లోకేశ్ శిబిరంలో కలవరం మెుదలైనట్లు తెలుస్తోంది. 40 నియోజకవర్గాల్లో లోకేశ్ ఇప్పటికే అభ్యర్థులను ఫైనలైజ్ చేసేశారని వారందరికీ టికెట్ ఇస్తున్నట్లు హామీ ఇచ్చేశారని ప్రచారం జరుగుతుంది.ఇలాంటి తరుణంలో చంద్రబాబు గెలిచే వారికే టికెట్లు అనడంతో వారందరికీ మింగుడు పడటం లేదు. తమ పరిస్థితి ఏంటని లోకేశ్ టీం ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఢోకాలేదంటున్న లోకేశ్

వచ్చే ఎన్నికల్లో సీట్ల విషయంలో హామీ ఇచ్చిన అంశాన్ని నాయకులు లోకేశ్‌కు గుర్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. హామీ ఇవ్వడంతో యువగళంలో మీ అడుగులో అడుగు వేశామని...ఇప్పుడు మా పరిస్థితి ఏంటని నిలదీస్తున్నట్లు తెలుస్తోంది. తాను హామీ ఇచ్చిన ప్రతీఒక్కరికీ న్యాయం చేస్తామని లోకేశ్ భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ పార్టీలో నారా లోకేశ్ నేతృత్వంలోనే టికెట్ల ఎంపిక ప్రక్రియ నడుస్తోందని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఖచ్చితంగా టికెట్లు కేటాయింపు అనేది లోకేశ్ సమక్షంలోనే జరుగుతాయని కాబట్టి ఆయన టీంకు ఎలాంటి ఢోకా లేదని తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed