రూ. 1500 కోట్ల పెట్టుబడులు పెట్టనున్న అముల్

by  |
రూ. 1500 కోట్ల పెట్టుబడులు పెట్టనున్న అముల్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ పాల ఉత్పత్తుల బ్రాండ్ అముల్ (Amul) పాల ప్రాసెసింగ్ ప్లాంట్లను స్థాపించేందుకు వచ్చే రెండేళ్లలో సుమారు రూ. 1,000 కోట్లను, తినే నూనె వంటి కొత్త ఉత్పత్తులపై మరో రూ. 500 కోట్ల పెట్టుబడులను పెట్టనున్నట్టు అముల్ ఎండీ ఆర్.ఎస్. సోధి తెలిపారు. కొవిడ్-19 (Kovid-19) వ్యాప్తి ఉన్నప్పటికీ బ్రాండెడ్ ఆహార ఉత్పత్తులకు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 12-15 శాతం ఆదాయ వృద్ధి సాధించగలమని ఆశిస్తున్నట్టు సోధి వెల్లడించారు.

అముల్ బ్రాండ్‌తో పాల ఉత్పత్తులను మార్కెట్ చేసే గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ (GCMMF) వచ్చే రెండేళ్లలో వివిధ రాష్ట్రాల్లో ప్రాసెసింగ్ ప్లాంట్ల ఏర్పాటుకు పెట్టుబడుల ద్వారా ప్రస్తుతం ఉన్న 380 లక్షల లీటర్ల ప్రాసెసింగ్ సామర్థ్యం రోజుకు 420 లక్షల లీటర్లకు పెరుగుతుందని ఆయన చెప్పారు. కొత్త వ్యాపారాలలో భాగంగా పాడి కొవ్వును ఉపయోగించి స్వీట్లు, బేకరీ వస్తువులను తయారు చేయడం ప్రారంభించినట్టు సోధీ పేర్కొన్నారు.

తినే నూనె, బేకరీ, బంగాళదుంపల ప్రాసెసింగ్ కోసం ఇప్పటికే సంస్థకు ప్లాంట్లు ఉన్నాయి. రానున్న రెండేళ్లలో కొత్త వ్యాపార ప్రదేశాల్లో ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు రూ. 400 కోట్ల నుంచి రూ. 500 కోట్ల పెట్టుబడులను పెడతామని సోధి చెప్పారు. ప్రస్తుత కరోనా వ్యాప్తి కాలంలో ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్య పాల ఉత్పత్తులైన పాలు, వెన్న, పన్నీర్, నెయ్యి అమ్మకాలు 15 శాతం వృద్ధి సాధించాయని, బ్రాండెడ్ ఆహార ఉత్పత్తుల వినియోగం పెరగడం వల్లే ఈ వృద్ధి సాధించినట్టు ఆయన వెల్లడించారు.

అలాగే, లాక్‌డౌన్ కారణంగా హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాంటీన్లు మూసేయడంతో ఐస్‌క్రీమ్ అమ్మకాలు 30-40 శాతం తగ్గాయన్నారు. సాధారణంగా వివాహ వేడుకల్లో ఐస్‌క్రీం అమ్మకాలు అధికంగా ఉంటాయి. ఈ ఏడాది కరోనా వల్ల ఈ విభాగం ప్రభావితమైందన్నారు.


Next Story

Most Viewed