భారత్‌తో వాణిజ్య సంబంధాలను పునరుద్ధరిస్తాం: పాక్

భారత్‌తో నిలిపివేయబడిన వాణిజ్య సంబంధాలను తిరిగి పునరుద్దరించడాన్ని పాకిస్థాన్ సీరియస్‌గా పరిశీలిస్తోందని ఆ దేశ విదేశాంగ మంత్రి మహమ్మద్ ఇషాక్ దార్ వెల్లడించారు.

Update: 2024-03-24 08:28 GMT

దిశ, నేషనల్ బ్యూరో: భారత్‌తో నిలిపివేయబడిన వాణిజ్య సంబంధాలను తిరిగి పునరుద్దరించడాన్ని పాకిస్థాన్ సీరియస్‌గా పరిశీలిస్తోందని ఆ దేశ విదేశాంగ మంత్రి మహమ్మద్ ఇషాక్ దార్ వెల్లడించారు. బ్రస్సెల్స్‌లో జరిగిన అణుశక్తి సదస్సులో పాల్గొన్న ఆయన.. లండన్‌లో మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు. ‘భారత్‌తో వాణిజ్యం కొనసాగించాలని పాక్ వ్యాపారులు కోరుకుంటున్నారు. ఈ విషయంపై పరిశీలిస్తున్నాం. దీనితో సంబంధమున్న వ్యక్తుల నుంచి పాక్ సలహాలు సూచనలు తీసుకుంటుంది. సమీక్షల అనంతరం తమ నిర్ణయాన్ని వెల్లడిస్తాం’ అని చెప్పారు. త్వరలోనే దీనిపై డిసిషన్ తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో భారత్-పాక్ దౌత్య సంబంధాల్లో మార్పులు జరుగుతాయని పలువురు భావిస్తున్నారు.

ఆర్టికల్ 370 రద్దుతో ప్రతిష్టంభన

కేంద్ర ప్రభుత్వం 2019 ఆగస్టు 5వ తేదీన జమ్మూ కశ్మీర్‌కు చెందిన ఆర్టికల్ 370ని రద్దు చేసిన విషయం తెలిసిందే. దీని ద్వారా కశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక హోదాను రద్దు చేసింది. అనంతరం భారత్-పాక్ మధ్య దౌత్య సంబంధాలు దిగజారాయి. ఈ నిర్ణయంతో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు దెబ్బతినేలా చేసిందని పాక్ పేర్కొంది. అంతేగాక ఆ టైంలో పాకిస్థాన్ ప్రధానిగా ఉన్న ఇమ్రాన్ ఖాన్ కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370ని పునరుద్ధరించే వరకు భారత్‌తో చర్చలు జరపబోమని చెప్పారు. అయితే దీనిపై స్పందించిన భారత్..ఆర్టికల్ 370రద్దు నిర్ణయం తమ అంతర్గత విషయమని, దానిలో ఎటువంటి మార్పు ఉండబోదని స్పష్టం చేసింది. దీంతో పాక్ విదేశాంగ మంత్రి తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Tags:    

Similar News