పపువా న్యూగినియా విషాదం.. 2 వేల మందికి పైగా సజీవ సమాధి

పపువా న్యూగినియాలో కొండ చరియలు విరిగిపడిన ఘటనలో 2 వేల మందికి పైగా సజీవ సమాధి అయినట్టు ఆ దేశ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.

Update: 2024-05-27 08:16 GMT

దిశ, నేషనల్ బ్యూరో: పపువా న్యూగినియాలో కొండ చరియలు విరిగిపడిన ఘటనలో 2 వేల మందికి పైగా సజీవ సమాధి అయినట్టు ఆ దేశ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ మేరకు సోమవారం ఐక్యరాజ్యసమితికి రాసిన లేఖలో వివరాలు వెల్లడించింది. అనేక మంది మరణించడంతో పాటు భవనాలు, ఆహార పంటలు దెబ్బతిన్నాయని, దాదాపు 1,250 మంది నిరాశ్రయులయ్యారని తెలిపింది. ఆ ప్రాంతంలో రెస్క్యూ చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొంది. అయితే అస్థిరమైన భూభాగం, మారుమూల ప్రాంతం కావడం, సమీపంలోని గిరిజనుల ఘర్షణలు జరుగుతున్న కారణంగా రెస్క్యూ కార్యకలాపాలకు ఆటంకం కలుగుతోందని తెలిపింది.

మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఐక్యరాజ్యసమితి అంచనా వేసిన 670 కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. ప్రభావిత ప్రాంతానికి సమీపంలో సుమారు 4,000 మంది ప్రజలు నివసిస్తున్నారని కేర్ ఇంటర్నేషనల్ కంట్రీ డైరెక్టర్ జస్టిన్ మెక్‌మాన్ తెలిపారు. ఘోరమైన కొండచరియలు విరిగిపడిన ప్రదేశానికి సహాయం చేయడానికి విమానం ఇతర పరికరాలను పంపడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆస్ట్రేలియా తెలిపింది. కాగా, ఎంగా ప్రావిన్స్‌లోని ఎంబాలి గ్రామంలో కొండచరియలు విరిగిపడిన విషయం తెలిసిందే. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. 

Tags:    

Similar News