Russia attack: ఉక్రెయిన్‌పై రష్యా భారీ దాడులు..ముగ్గురు పౌరులు మృతి

ఉక్రెయిన్‌పై రష్యా విరుచుకుపడింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంపై డ్రోన్లు, క్షిపణులతో భారీ దాడికి పాల్పడింది.

Update: 2024-08-26 09:56 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఉక్రెయిన్‌పై రష్యా విరుచుకుపడింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంపై సోమవారం తెల్లవారుజామున డ్రోన్లు, క్షిపణులతో భారీ దాడికి పాల్పడింది. ఇంధన మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని చేసిన ఈ దాడిలో ముగ్గురు పౌరులు మరణించారు. పశ్చిమ లుట్స్క్, తూర్పు డ్నిప్రో, దక్షిణ జపోరిజ్జియా ప్రాంతాలలో మరణాలు నమోదయ్యాయి. ఈ ఘటనను ఉక్రెయిన్ సైతం ధ్రువీకరించింది. దాడి సమయంలో రాజధాని కీవ్‌లో పేలుళ్ల శబ్దాలు వినిపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఘటన అనంతరం నగరంలో విద్యుత్, నీటి సరఫరాలకు అంతరాయం ఏర్పడిందని ప్రాంతీయ అధికారులు తెలిపారు. వాయువ్య నగరమైన లుట్స్క్‌లో ఒక అపార్ట్‌మెంట్ దెబ్బతిన్నదని వెల్లడించారు.

ఉక్రేనియన్లు కొంతకాలంగా రష్యా క్షిపణి దాడులు చేస్తోందని అంచనా వేస్తున్నారు. ఉక్రెయిన్ స్వాతంత్ర్య దినోత్సవం రోజున దాడి జరిగే ప్రమాదం ఉందని యూఎస్ రాయబార కార్యాలయం గత వారం హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే కీవ్ పై దాడులు జరగడం గమనార్హం. మరోవైపు రష్యాను ఎదురుదెబ్బ కొట్టేందుకు ఉక్రెయిన్ సైతం డ్రోన్ దాడులను వేగవంతం చేసినట్టు తెలుస్తోంది. ప్రెసిడెంట్ జెలెన్ స్కీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఆండ్రీ యెర్మాక్ మాట్లాడుతూ రష్యాపై తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పారు. తాజా దాడులపై రష్యా స్పందించలేదు. అయితే ఉక్రెయిన్ సైన్యం రష్యాలోని కుర్క్స్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో రష్యా ప్రతీకారం తీర్చుకోవడం ప్రారంభించిందని తెలుస్తోంది. 

Tags:    

Similar News