బ్రిటన్ పార్లమెంటరీ డిసిప్లినరీ స్టాండింగ్ కమిటీకి క్షమాపణలు చెప్పిన బ్రిటన్ ప్రధాని..
బ్రిటన్ పార్లమెంటరీ డిసిప్లినరీ స్టాండింగ్ కమిటీకి ప్రధాని రిషి సునాక్ క్షమాపణలు చెప్పారు.
లండన్ : బ్రిటన్ పార్లమెంటరీ డిసిప్లినరీ స్టాండింగ్ కమిటీకి ప్రధాని రిషి సునాక్ క్షమాపణలు చెప్పారు. చైల్డ్కేర్ సేవలు అందించే ఓ కంపెనీలో భార్య అక్షతా మూర్తికి వాటాలు ఉన్నాయని బ్రిటన్ మీడియాలో వార్తలు వచ్చినా.. ప్రధాని హోదాలో దేశ ప్రజలకు రిషి వివరణ ఇవ్వకపోవడాన్ని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తప్పుపట్టింది. ఈ వ్యవహారంపై ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు దర్యాప్తు చేసిన కమిటీ అక్షతామూర్తికి సదరు చైల్డ్కేర్ సేవల కంపెనీలో వాటాలున్న విషయం నిజమేనని ధ్రువీకరించింది. అయితే ఉద్దేశపూర్వకంగా లేదా దురుద్దేశంతో ఈ సమాచారాన్ని రిషి సునాక్ దాచలేదని పేర్కొంటూ కమిటీ ఒక నివేదికను విడుదల చేసింది.
కనీసం సీనియర్ ఎంపీలకైనా తన భార్య షేర్ల గురించి రిషి చెప్పి ఉంటే బాగుండేదని ఆ రిపోర్టులో ప్రస్తావించింది. ఈమేరకు కమిటీ ఇచ్చిన నివేదికను అంగీకరించిన రిషి సునాక్ క్షమాపణలు చెప్పారు. చైల్డ్కేర్ సేవలను అందించే ఒక కంపెనీలో భార్య అక్షతా మూర్తికి ఉన్న వాటాల రిజిస్ట్రేషన్, డిక్లరేషన్లో గందరగోళానికి గురైనందున ఆ విషయాన్ని అప్పట్లో వెల్లడించలేకపోయానని వివరణ ఇస్తూ.. విచారణ కమిటీ సారథి డేనియల్ గ్రీన్బర్గ్కు బ్రిటన్ ప్రధాని లేఖ రాశారు. దీంతో ప్రధానిపై దర్యాప్తును ఆపేశామని, ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని డేనియల్ గ్రీన్బర్గ్ వెల్లడించారు.