భారత ఎన్నికలపై మేం స్పందించబోం : పాకిస్థాన్
దిశ, నేషనల్ బ్యూరో : భారత్లో ఇటీవల జరిగిన ఎన్నికలపై, ఆ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలపై తాము ఎటువంటి వ్యాఖ్యలు చేయబోమని పాకిస్థాన్ స్పష్టం చేసింది.
దిశ, నేషనల్ బ్యూరో : భారత్లో ఇటీవల జరిగిన ఎన్నికలపై, ఆ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలపై తాము ఎటువంటి వ్యాఖ్యలు చేయబోమని పాకిస్థాన్ స్పష్టం చేసింది. భారత్ అంతర్గత వ్యవహారాలపైనా స్పందించబోమని పాక్ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జాహ్రా బలోచ్ తేల్చి చెప్పారు. గురువారం మీడియా సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్లో ఎన్నికల గురించి మీడియా ప్రతినిధులు స్పందన కోరగా.. ముంతాజ్ జాహ్రా ఈమేరకు బదులిచ్చారు. ‘‘భారత్లో నరేంద్ర మోడీ విజయంపై ఇరుదేశాల ప్రధానుల మధ్య లేఖల మార్పిడి జరగలేదు. అయితే మోడీ ప్రమాణ స్వీకారం అనంతరం శుభాకాంక్షలు తెలుపుతూ పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఓ ట్వీట్ చేశారు’’ అని ఆమె గుర్తుచేశారు. ‘‘కొత్తగా బాధ్యతలు చేపట్టిన దేశాధినేతలు, ప్రభుత్వాధినేతలను అభినందించడం ఆనవాయితీ. అందులో భాగంగానే మోడీని ప్రధాని షరీఫ్ అభినందించారు. మోడీ కూడా బదులిచ్చారు. ఈ విషయంలో మరింత వివరణ ఇవ్వదల్చుకోలేదు’’ అని ముంతాజ్ చెప్పారు.