Lebanon: లెబనాన్‌‌ పేలుళ్లు..32కు చేరిన మృతుల సంఖ్య

లెబనాన్‌లో పేజర్లు, వాకీటాకీలు పేలిన ఘటనల్లో మరణించిన వారి సంఖ్య 32కు చేరుకుంది.

Update: 2024-09-19 03:27 GMT

దిశ, నేషనల్ బ్యూరో: లెబనాన్‌లో పేజర్లు, వాకీటాకీలు పేలిన ఘటనల్లో మరణించిన వారి సంఖ్య 32కు చేరుకుంది. మొత్తంగా 3,250 మందికి పైగా గాయపడ్డారు. పేజర్లు పేలిన ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోగా, వాకీటాకీలు పేలి 12 మంది మృతి చెందినట్టు లెబనాన్ ఆరోగ్య శాఖ ప్రకటించింది. వరుస పేలుళ్ల ఫలితంగా 60 ఇళ్లు, 15 కార్లు, డజన్ల కొద్దీ ద్విచక్ర వాహనాలు దగ్ధమైనట్టు తెలిపింది. సహాయక చర్యలు చేపట్టేందుకు అగ్నిమాపక సిబ్బందిని మోహరించారు. ఈ దాడులకు ఇజ్రాయెల్ కారణమని హిజ్బొల్లా ఆరోపిస్తోంది. ఈ అటాక్స్‌పై హిజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా గురువారం ప్రసంగించనున్నట్టు తెలుస్తోంది. అలాగే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(యూఎన్ఎస్సీ) సైతం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది.

లెబనాన్‌లో పేజర్ పేలుడులో ఇరాన్ రాయబారి మోజ్తాబా అమానీ ఒక కన్ను దెబ్బతిందని, అతని మరో కంటికి కూడా గాయాలయ్యాయని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ సభ్యులు తెలిపారు. అతడిని చికిత్స నిమిత్తం టెహ్రాన్‌కు తరలించనున్నట్టు వెల్లడించారు. లెబనాన్ సమాచార మంత్రి జియాద్ మకారి మీడియాతో మాట్లాడుతూ ఇజ్రాయెల్ నేరాలకు తమ దేశం భయపడలేదని తెలిపారు. ఇది కొత్త రకమైన యుద్ధం అని దీనిపై పరిశోధనలు జరుగుతున్నాయని తెలిపారు. లెబనీస్ సార్వభౌమాధికారంపై దాడి జరిగినందున, హిజ్బొల్లాకు సహకరిస్తామని వెల్లడించారు. మరోవైపు పేలుళ్లపై ఇజ్రాయెల్ అధికారికంగా స్పందిచలేదు. అయితే భద్రతా వర్గాలు మాత్రం ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొస్సాద్ పేలుళ్లకు కారణమని భావిస్తున్నాయి.  


Similar News