ఇద్దరు బంధీలను రక్షించిన ఇజ్రాయెల్: రఫా నగరంలో ఆపరేషన్

గాజాలోని రఫా నగరంలో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి ఇద్దరు బంధీలను రక్షించినట్టు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) సోమవారం తెలిపింది. రఫాలోని ఓ భవనంలో వీరు ఉన్నారన్న సమాచారం మేరకు ఆపరేషన్ చేపట్టినట్టు పేర్కొంది.

Update: 2024-02-12 04:57 GMT

దిశ, నేషనల్ బ్యూరో: గాజాలోని రఫా నగరంలో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి ఇద్దరు బంధీలను రక్షించినట్టు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) సోమవారం తెలిపింది. రఫాలోని ఓ భవనంలో వీరు ఉన్నారన్న సమాచారం మేరకు ఆపరేషన్ చేపట్టినట్టు పేర్కొంది. ఇజ్రాయెల్ సెక్యూరిటీ ఏజెన్సీ, ఇజ్రాయెల్ పోలీసులతో కలిసి దాడులు చేసినట్టు తెలిపింది. ఇద్దరు బందీలను సైమన్ మర్మాన్, లూయిస్ హర్‌లుగా గుర్తించారు. వీరి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉన్నట్టు ఐడీఎఫ్ వెల్లడించింది. తదుపరి వైద్య పరీక్షల నిమిత్తం ఇజ్రాయెల్‌కు తరలించారు. ఇజ్రాయెల్ మిలిటరీ ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ రిచర్డ్ హెచ్ట్ మాట్లాడుతూ.. ‘ఇది చాలా క్లిష్టమైన ఆపరేషన్. ఈ చర్య కోసం ఎంతో కాలంగా నిఘా ఉంచాం. సరైన పరిస్థితుల కోసం ఎదురు చూశాం’ అని తెలిపారు. రెండో అంతస్తులో బంధీలు ఉన్నారని, వారిని విడిపించేందుకు కాల్పులు జరపడంతో పాటు వైమాణిక దాడులు చేశామని పేర్కొన్నారు. వీరిద్దరినీ గతేడాది అక్టోబర్ 7న జరిపిన దాడుల అనంతరం హమాస్ బంధీలుగా చేసుకుంది. కాగా, గాజాలోని రఫా నగరంలో సైనిక దాడులు చేపట్టొద్దని అమెరికా సహా వివిధ దేశాలు ఇజ్రాయెల్‌కు సూచించిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రాంతంపై దాడి చేయొద్దని కోరిన కొద్ది గంటల్లోనే దాడి జరగడం గమనార్హం.

హమాస్ చెరలో ఇంకా 130 మంది!

ఇ జ్రాయెల్ అధికారుల ప్రకారం. ఇంకా130 మందికి పైగా హమాస్ చెరలో ఉన్నట్టు తెలుస్తోంది. అందులో 29 మంది చనిపోయారని ఐడీఎఫ్ భావిస్తోంది. అయితే అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ, ఇజ్రాయెల్ సైన్యం గతంలో అక్టోబరు చివరిలో బందీగా ఉన్న ఒక సైనికుడిని మాత్రమే విజయవంతంగా రక్షించింది. తాజాగా విడిపించిన వారు రెండో, మూడో బంధీలు కావడం గమనార్హం. కాగా, గత నాలుగు నెలల యుద్ధంలో గాజాలో 28,000 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారని ఆరోగ్య అధికారులు తెలిపారు. సుమారు 80శాతం మంది తమ ఇళ్ల నుంచి వెళ్లిపోయినట్టు అంతర్జాతీయ సంస్థలు అంచనా వేశాయి. అందులో సగం కంటే ఎక్కువ మంది రఫా నగరంలో ఆశ్రయం పొందుతున్నారు.

Tags:    

Similar News