Israel Hamas war: గాజాపై ఇజ్రాయెల్ వైమాణిక దాడి..30 మంది పాలస్తీనియన్లు మృతి

గాజాపై ఇజ్రాయెల్ నిరంతరం విరుచుకుపడుతూనే ఉంది. సెంట్రల్ గాజాలోని దీర్ అల్ బలాహ్‌లోని బాలికల పాఠశాలపై శనివారం వైమానిక దాడి చేసింది.

Update: 2024-07-27 14:24 GMT

దిశ, నేషనల్ బ్యూరో: గాజాపై ఇజ్రాయెల్ నిరంతరం విరుచుకుపడుతూనే ఉంది. సెంట్రల్ గాజాలోని దీర్ అల్ బలాహ్‌లోని బాలికల పాఠశాలపై శనివారం వైమానిక దాడి చేసింది. ఈ ఘటనలో 30 మంది పాలస్తీనియన్లు మరణించగా..మరో 100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డట్టు పాలస్తీనా అధికారులు తెలిపారు. గాయపడిన వారిని అల్-అక్సా ఆస్పత్రికి తరలించినట్టు పేర్కొన్నారు. అయితే కొంతమంది బాధితులు రక్తంతో తడిసిన వారి దుస్తులతో కాలినడకన ఆస్పత్రికి వచ్చారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అలాగే ఇతర దాడుల్లో మరో 14 మంది మరణించారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

యూఎస్, ఈజిప్ట్, ఖతార్, ఇజ్రాయెల్ అధికారులు ఇటలీలో సమావేశమై బందీల విడుదల, కాల్పుల విరమణపై చర్చించడానికి ఒక రోజు ముందే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. అయితే ఖాదీజా స్కూల్ కాంపౌండ్‌లోని హమాస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఖాన్ యూనిస్ దక్షిణ పొరుగు ప్రాంతాలను తాత్కాలికంగా ఖాళీ చేయమని ఇజ్రాయెల్ సైన్యం పాలస్తీనియన్లను ఆదేశించింది. కాగా, ఇజ్రాయెల్ హమాస్ ఘర్షణలో ఇప్పటివరకు 39, 000 మందికిపై గా పాలస్తీనియన్లు మరణించారు. 

Tags:    

Similar News