గాజా స్కూల్‌పై వైమానిక దాడి.. పిల్లలు సహా 28 మంది దుర్మరణం

సెంట్రల్ గాజాలో దేర్ అల్ బలాహ్‌లోని ఓ స్కూల్ పై ఇజ్రాయెల్ గురువారం వైమానిక దాడికి పాల్పడింది. ఈ ఘటనలో పిల్లలు, మహిళలు సహా 28 మంది అసువులుబాశారు.

Update: 2024-10-10 18:29 GMT

దిశ, నేషనల్ బ్యూరో: గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తూనే ఉన్నది. బుధవారం నార్త్ గాజాలోని జబాలియాలో శరణార్థి శిబిరంలోని హాస్పిటల్‌పై దాడి చేయగా 18 మంది మరణించారు. గురువారం సెంట్రల్ గాజాలో దేర్ అల్ బలాహ్‌లోని ఓ స్కూల్ పై వైమానిక దాడికి పాల్పడింది. ఈ ఘటనలో పిల్లలు, మహిళలు సహా 28 మంది అసువులుబాశారు. పేషెంట్ల ప్రాణాలను గాలికొదిలేసి మూడు హాస్పిటళ్లను వెంటనే ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ ఆర్మీ వార్నింగ్ ఇచ్చింది.

ఆ స్కూల్‌లో హమాస్ టెర్రరిస్టులు కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేసుకున్నారని, తాము అత్యంత కచ్చితత్వంతో ఈ దాడి చేశామని ఇజ్రాయెల్ మిలిటరీ పేర్కొంది. కాగా, హమాస్ ఈ ఆరోపణలను ఖండించింది. ఈ ఘటనలో మరో 54 మంది గాయపడినట్టు వైద్యులు తెలిపారు. ఆరు రోజుల క్రితం నార్త్ గాజాలో ఇజ్రాయెల్ మిలిటరీ జబాలియాలో ఆపరేషన్ మొదలుపెట్టిందని, అప్పటి నుంచి 130 మంది ప్రజలు ఈ ఆపరేషన్‌లో మరణించారని పాలస్తీనియన్ వైద్యశాఖ అధికారులు తెలిపారు.

లెబనాన్ విధ్వంసం వద్దు

లెబనాన్‌ను మరో గాజా చేస్తామని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కామెంట్ చేసిన నేపథ్యంలో అమెరికా సీరియస్ అయింది. గాజాలో చేపట్టిన మిలిటరీ ఆపరేషన్‌ను లెబనాన్‌లో మొదలుపెట్టవద్దని సూచించింది. గాజా వంటి విధ్వంసం వద్దని వార్నింగ్ ఇచ్చింది. లెబనాన్‌ను గాజాలా మార్చొద్దని తెలిపింది. లెబనాన్ ప్రజలు హిజ్బుల్లాను తరిమేసి వారి దేశాన్ని కాపాడుకోవాలని, లేదంటే గాజా వంటి విధ్వంసాన్ని చూడాల్సి ఉంటుందని నెతన్యాహు ఓ వీడియో సందేశంలో పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో నెతన్యాహు మాట్లాడిన తర్వాత అమెరికా నుంచి ఈ రియాక్షన్ రావడం గమనార్హం. లెబనానన్‌లో పౌరులకు ఎక్కువ హానీ తలపెట్టరాదని, ముఖ్యంగా జనసమ్మర్ధం ఎక్కువగా ఉండే బిరూట్‌లో దాడులు చేపట్టరాదని అమెరికా స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా.. గాజాలో ఐక్యరాజ్యసమితి దర్యాప్తులో మరో విషయం బయటపడింది. గాజాలో వైద్యారోగ్య వ్యవస్థను ఇజ్రాయెల్ బాంబులతో పూర్తిగా నాశనం చేసిందని, ఇది యుద్ధ నేరమే కాదు.. ఊచకోత కోసినట్టుగానే భావించాల్సి ఉంటుందని పేర్కొంది.

Tags:    

Similar News