Iran coal mine: బొగ్గు గనిలో మీథేన్ గ్యాస్ లీక్.. 30 మంది కార్మికులు మృతి

ఇరాన్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బొగ్గు గనిలో మీథేన్ లీక్ కావడంతో పేలుడు సంభవించింది.

Update: 2024-09-22 08:47 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఇరాన్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బొగ్గు గనిలో మీథేన్ లీక్ కావడంతో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 30 మంది ప్రాణాలు కోల్పోయారు. స్థానిక మీడియా వెల్లడించిన కథనాల ప్రకారం.. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌కు ఆగ్నేయంగా 540 కిలోమీటర్ల దూరంలో ఉన్న తబాస్‌ బొగ్గు గనిలో శనివారం అర్ధరాత్రి గనిలోని రెండు బ్లాకుల్లో మీథేన్ గ్యాస్ లీకైంది. ఈ కారణంగా గనిలో భారీ పేలుడు సంభవించింది. దీంతో అక్కడికక్కడే 30 మంది కార్మికులు మరణించగా..17 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరో 24 మంది మైనర్లు గని లోపల చిక్కుకున్నారు. ప్రమాద సమయంలో 70 మంది గనిలో పని చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. సమాచారం అందిన వెంటనే రెస్క్యూ టీమ్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించింది.

ఈ ఘటనపై ఇరాన్ అధ్యక్షుడు పెజిష్కియాన్ స్పందించారు. గనిలో చిక్కుకున్న వారిని రక్షించడానికి అన్ని చర్యలూ తీసుకోవాలని అధికారులను కోరారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని పేర్కొన్నారు. ప్రమాదంపై దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గనిలో చిక్కుకున్న కార్మికులను వెలికితీసేందుకు రెస్క్యూ టీమ్‌లు పనిచేస్తున్నాయని సౌత్ ఖొరాసన్ ప్రావిన్స్ గవర్నర్ జావద్ ఘెనాట్ తెలిపారు. కాగా, గతంలోనూ ఇరాన్‌లో ఈ తరహా ఘటనలు చోటు చేసుకున్నాయి. 2013లో రెండు వేర్వేరు మైనింగ్ ఘటనల్లో 11 మంది కార్మికులు చనిపోయారు. అలాగే 2009లో 20 మంది, 2017లో బొగ్గు గని పేలుడు కారణంగా 42 మంది మరణించారు.  


Similar News