హరారే : జింబాబ్వేలోని మషావా ప్రాంతంలో విమానం కూలిపోయిన ఘటనలో భారత సంతతి వ్యాపారవేత్త హర్పాల్ రంధావా, ఆయన కుమారుడు సహా మొత్తం ఆరుగురు మృతిచెందారు.హర్పాల్ రంధావా జింబాబ్వేలో రియోజిమ్ పేరుతో మైనింగ్ కంపెనీ నిర్వహిస్తున్నారు. ఈ కంపెనీ బంగారం, బొగ్గును ఉత్పత్తి చేయడంతో పాటు నికెల్, రాగిని శుద్ధి చేస్తుంది.
శుక్రవారం హర్పాల్, ఆయన కుమారుడు మరో నలుగురు సిబ్బందితో కలిసి కంపెనీకి చెందిన ‘సెస్నా 206’ విమానంలో జింబాబ్వేలోని హరారే నుంచి మురోవాలోని మైనింగ్ ప్రాంతానికి బయలుదేరారు. మార్గం మధ్యలో ఈ విమానం మషావా ప్రాంతానికి చేరుకున్న తర్వాత సాంకేతిక లోపంతో కూలిపోయింది. ఈ ఘటనలో విమానంలోని ఆరుగురు కూడా చనిపోయారు.