ప్రస్తుత పరిస్థితుల్లో యుద్ధం తప్పదు..కిమ్ సంచలన వ్యాఖ్యలు

ఇప్పటికే రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతున్న వేళ ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-04-11 04:53 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఇప్పటికే రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతున్న వేళ ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ దేశంలో నెలకొన్న ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో యుద్ధం తప్పకపోవచ్చని అన్నారు. యుద్ధానికి సన్నద్ధం కావాల్సిన సమయం ఆసన్నమైందని నొక్కి చెప్పారు. దేశంలోని ప్రధాన సైనిక విశ్వవిద్యాలయమైన కిమ్ జోంగ్ ఇల్ మిలిటరీ యూనివర్సిటీని ఆయన సందర్శించారు. కిమ్ 2011లో తన తండ్రి పేరు మీద దీనిని స్థాపించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కిమ్ ప్రసంగించినట్టు స్థానిక మీడియా సంస్థలు వెల్లడించాయి. ఉత్తర కొరియా సైనిక ఘర్షణను ఎంచుకుంటే చుట్టూ ఉన్న అన్ని మార్గాలను మూసేస్తుందని తెలిపారు.

శత్రుదేశాలు కవ్వింపు చర్యలకు పాల్పడితే ఊరుకునే ప్రసక్తే లేదని కిమ్ హెచ్చరించారు. అంతర్జాతీయ పరిస్థితులు సైతం క్షిష్టంగా ఉన్నాయని వెల్లడించారు. కాబట్టి యుద్ధం తప్పకపోవచ్చని దానికి సిద్ధంగా ఉండాల్సిన టైం వచ్చిందని తెలిపారు. ఉత్తరకొరియా ఇటీవల ఆయుధాల అభివృద్ధిని వేగవంతం చేసింది. రష్యాతోనూ సన్నిహిత సంబంధాలను ఏర్పర్చుకుంది. అంతేగాక ఉక్రెయిన్‌తో కొనసాగుతున్న యుద్ధంలో రష్యాకు కిమ్ సహాయం చేశారని ఆరోపణలు సైతం వచ్చాయి. దీనితో పాటు ఘన ఇంధనాన్ని ఉపయోగించి కొత్త హైపర్ సోనిక్ మీడియం రేంజ్ బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాన్ని కూడా కిమ్ ఇటీవల పర్యవేక్షించారు. ఇది క్షిపణులను మరింత ప్రభావవంతంగా తయారు చేస్తుందని పలువురు అభిప్రాయపడ్డారు.

కాగా, ఇటీవల అమెరికా, దక్షిణ కొరియాలు తమ ఉమ్మడి సైనిక విన్యాసాలతో ఉత్తరకొరియాను కవ్విస్తున్నాయి. ఇవి గత వారం నుంచి ఎక్కువయ్యాయి. అయితే దీనికి ఉత్తరకొరియా సైతం ధీటుగానే బదులిస్తోంది. దక్షిణ కొరియా మీదుగా ఎప్పటికప్పుడు క్షిపణులను ప్రయోగిస్తోంది. దీంతో ఉత్తర కొరియా, దక్షిణ కొరియాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలోనే కిమ్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. 

Tags:    

Similar News