'భారత్తో సంబంధాలు బలపర్చుకోవాలి.. అప్పుడే చైనాను అడ్డుకోగలం'
రిపబ్లికన్ పార్టీ అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో ఉన్న భారత సంతతి నేత వివేక్ రామస్వామి చైనాపై విరుచుకుపడ్డారు.
వాషింగ్టన్ : రిపబ్లికన్ పార్టీ అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో ఉన్న భారత సంతతి నేత వివేక్ రామస్వామి చైనాపై విరుచుకుపడ్డారు. చైనా నుంచి అమెరికా వాణిజ్య స్వాతంత్ర్యాన్ని పొందాలంటే ఇండియా, ఇజ్రాయెల్ వంటి దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకోవాలన్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో వివేక్ ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఫార్మా రంగం అవసరాల కోసం భారత్, ఇజ్రాయెల్తో.. కంప్యూటర్ చిప్స్, ఎలక్ట్రిక్ వాహన బ్యాటరీల తయారీ ముడి సరుకుల కోసం భారత్, బ్రెజిల్, చిలీ, జపాన్, దక్షిణ కొరియాతో జట్టు కడితే మంచి ఫలితాలు ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. తద్వారా ఆయా రంగాల్లో చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టొచ్చని సూచించారు.