BIG Breaking: యూఏఈ (UAE)లో నివసిస్తున్న భారతీయులకు గుడ్ న్యూస్.. మరో ఛాన్స్ ఇచ్చిన ప్రభుత్వం..!

యూఏఈ (UAE)లో అక్రమంగా నివసిస్తున్నవారికి ఆ దేశ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.

Update: 2024-09-01 22:28 GMT

దిశ, వెబ్‌డెస్క్: యూఏఈ (UAE)లో అక్రమంగా నివసిస్తున్నవారికి ఆ దేశ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వీసా గడువు ముగిసినా తమ దేశంలో చట్ట విరుద్ధంగా ఉంటున్న వారి కోసం అక్కడి ప్రభుత్వం రెండు నెలల వీసా ఆమ్నెస్టీ కార్యక్రమాన్ని నిన్న ప్రారంభించింది. దీని ద్వారా అక్రమ నివాసితులెవరైనా తమ వీసా క్రమబద్దీకరణ చేసుకునేందుకు లేదా ఎలాంటి జరిమానా లేకుండా దేశం విడిచి వెళ్లిపోవచ్చు.యూఏఈ లో జన్మించినప్పటికీ సరైన పత్రాలు లేనివారితో పాటు స్పాన్సర్ల నుంచి తప్పించుకొని అక్కడే నివసిస్తున్న వారికి కూడా ఇది వర్తిస్తుంది.కాగా యూఏఈ జనాభాలో దాదాపు 30 శాతం మంది భారతీయులే ఉన్నారు. ముఖ్యంగా దుబాయ్, అబుదాబి లాంటి నగరాల్లో ఎక్కువ మంది భారతీయులు నివసిస్తున్నారు.ఈ నేపథ్యంలో యూఏఈలోని భారతీయులకు సహాయం చేసేందుకు అక్కడున్న మన రాయబార కార్యాలయం ఒక అడ్వైజరీ జారీ చేసింది.

భారత రాయబార కార్యాలయం జారీ చేసిన అడ్వైజరీ ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి..

1. భారత్‌కు తిరిగి వెళ్లాలనుకొనేవారు ఎమర్జెన్సీ సర్టిఫికెట్‌(ఈసీ) కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. తమ వీసాను క్రమబద్దీకరించుకోవాలనుకొనేవారు మాత్రం టెంపరరీ పాస్‌పోర్ట్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

2.ఎమర్జెన్సీ సర్టిఫికెట్‌ కోసం ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.వీటికోసం దుబాయ్‌లోని భారత రాయబార కార్యాలయం అలాగే అవిర్‌ ఇమ్మిగ్రేషన్‌ సెంటర్‌లో సమాచార కేంద్రాలు ఏర్పాటు చేశామని, వీటికోసం ముందస్తుగా ఎటువంటి అపాయింట్మెంట్ అవసరం లేదని భారత కాన్సులేట్ తెలిపింది.

3.ఎమర్జెన్సీ సర్టిఫికెట్‌ కోసం దరఖాస్తు చేసుకున్న వారు మరుసటి రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య దుబాయ్‌లోని భారత రాయబార కార్యాలయం నుంచి తమ ఎమర్జెన్సీ సర్టిఫికెట్‌ ను తీసుకోవచ్చు.

4. ట్రావెల్‌ డాక్యుమెంట్‌ సమాచారం కోసం ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల మధ్య 050-9433111 మొబైల్‌ నెంబర్‌లో సంప్రదించవచ్చు. ప్రతి రోజూ 24 గంటలు పనిచేసే పీబీఎస్‌కె హెల్ప్‌లైన్‌ 800-46342కు అయినా కాల్‌ చేయొచ్చు.

5. వీసా ఆమ్నెస్టీ కార్యక్రమం అమల్లో ఉన్న వ్యవధిలోనే ఈ సమాచార కేంద్రాలు అందుబాటులో ఉంటాయని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. 


Similar News