పోలీస్ స్టేషన్లలో దాష్టికం.. ఇద్దరిని చితకబాదిన పోలీసులు

దిశ, సూర్యాపేట : సూర్యాపేట జిల్లాల్లోని రెండు పోలీస్ స్టేషన్లలో పోలీసులు రెచ్చిపోయారు. వేర్వేరు ఘటనలో ఇద్దరు వ్యక్తులను చితకబాదారు. ఓ స్టేషన్‌లో ఎస్ఐ ప్రజాప్రతినిధిపై తన ప్రతాపాన్ని చూపగా.. మరో స్టేషన్‌లో కానిస్టేబుల్ ఓ యువకుడిపై హీరోయిజాన్ని చూపించాడు. బాధితుల కథనం ప్రకారం ఆత్మకూర్(ఎస్), నూతనకల్ పోలీస్ స్టేషన్లలో జరిగిన ఈ ఘటనలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన 1వ వార్డు మెంబర్ ఆవుల సింహాద్రిని ఆత్మకూర్(ఎస్) ఎస్ఐ లింగం […]

Update: 2021-07-27 12:39 GMT

దిశ, సూర్యాపేట : సూర్యాపేట జిల్లాల్లోని రెండు పోలీస్ స్టేషన్లలో పోలీసులు రెచ్చిపోయారు. వేర్వేరు ఘటనలో ఇద్దరు వ్యక్తులను చితకబాదారు. ఓ స్టేషన్‌లో ఎస్ఐ ప్రజాప్రతినిధిపై తన ప్రతాపాన్ని చూపగా.. మరో స్టేషన్‌లో కానిస్టేబుల్ ఓ యువకుడిపై హీరోయిజాన్ని చూపించాడు. బాధితుల కథనం ప్రకారం ఆత్మకూర్(ఎస్), నూతనకల్ పోలీస్ స్టేషన్లలో జరిగిన ఈ ఘటనలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన 1వ వార్డు మెంబర్ ఆవుల సింహాద్రిని ఆత్మకూర్(ఎస్) ఎస్ఐ లింగం చితక బాదాడు. ఈ నెల18న గ్రామంలో ఒకే కులానికి చెందిన రెండు కుటుంబాల మధ్య ఓ భూ పంచాయితీ జరిగింది. ఆ పంచాయితీలో ఆ కుల పెద్ద మనిషిగా ఇరువర్గాల వారిని వారించే ప్రయత్నం చేసిన సింహాద్రిపై పోలీసులు ఈ నెల 19న కేసులు నమోదు చేశారు. కేసు నమోదు చేసిన ఎస్ఐ లింగం బాధితుడిని రిమాండ్ చేయకుండా స్టేషన్‌కు తిప్పుకుంటూ హింసకు గురి చేసినట్లు సింహాద్రి వాపోయాడు.

ఈ క్రమంలో మంగళవారం సింహాద్రితో పాటు అదే కేసులో నిందితులుగా ఉన్న మరో ఇద్దరు వ్యక్తులను, ఓ మహిళను పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. రిమాండ్ చేస్తామని చెప్పి స్టేషన్‌కు పిలిచి లాకప్‌లో వేసి సింహాద్రిని చితకబాదాడు. దీంతో ఆయన బీపీ డౌన్ అయ్యి, అస్వస్థతకు గురయ్యాడని వాళ్ల బంధువులు తెలిపారు. వెంటనే ఎస్ఐ తాను కొట్టినట్లు ఎవరికి చెప్పొద్దని సింహాద్రిని బతిమిలాడి కానిస్టేబుల్ సహాయంతో స్థానికంగా వైద్య చికిత్స అందించినట్లు తెలిపారు. విషయం బయటకు చెబుతాడని వెంటనే సింహాద్రిని రిమాండ్ చేసిన్నట్లు వారి బంధువులు చెబుతున్నారు.

ఎస్ఐ కనికరించినా.. కానిస్టేబుల్ ఆగలే..

పోలీస్ దెబ్బలకు యువకుడు స్పృహ తప్పి పడిపోయిన సంఘటన నూతనకల్ మండల పోలీస్ స్టేషన్‌లో చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం నూతనకల్ మండలం చిల్పకుంట్ల గ్రామానికి చెందిన గుణగంటి పరమేష్ మండల కేంద్రంలోని అతని స్నేహితుని షాప్ ముందు నిలపడి ఉన్నాడు. అటుగా వచ్చిన కానిస్టేబుల్ కమలహాసన్ ఇక్కడేందుకు ఉన్నారంటూ వారిని పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లాడు. వారి దగ్గర ఉన్న రెండు ద్విచక్ర వాహనాలను స్టేషన్‌లో పెట్టించడంతోపాటు వాళ్లను కొట్టి వదిలిపెట్టినట్లు బాధితులు తెలిపారు. మళ్లీ ఉదయం స్టేషన్‌కు రావాలని చెప్పడంతో మంగళవారం వెళ్లిన బాధితులను ఎస్సై ప్రసాద్ మందలించి పంపించాడు. ఎస్ఐ పంపించినా కానిస్టేబుల్ కమలహాసన్.. పరమేష్‌ను బెల్ట్‌తో కొట్టాడంతో ఆ దెబ్బలకు పోలీస్ స్టేషన్‌లోనే స్పృహతప్పి పడిపోయాడు. ఫ్రెండ్లీ పోలీస్ విధానం ఉన్నప్పటికీ స్టేషన్‌లోనే ఎస్సైకి తెలియకుండా యువకున్ని కొట్టిన కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకోవాలని బాధితుడు కోరుతున్నాడు.

Tags:    

Similar News