క్లిష్ట పరిస్థితుల్లోను ఇలా చేయడం ఒక్క కేసీఆర్‌కే సాధ్యం: మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: అన్ని వ‌ర్గాల మ‌ధ్య స‌మ‌తూకం తీసుకువ‌చ్చేలా, స‌మాజంలోని అన్ని- latest Telugu news

Update: 2022-03-07 12:19 GMT

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: అన్ని వ‌ర్గాల మ‌ధ్య స‌మ‌తూకం తీసుకువ‌చ్చేలా, స‌మాజంలోని అన్ని వ‌ర్గాల ప్రయోజ‌నాల‌ను ప‌రిర‌క్షించే స‌మ‌గ్ర బ‌డ్జెట్- 2022-23 అని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అభివ‌ర్ణించారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ‌మే ల‌క్ష్యంగా బ‌డ్జెట్‌లో నిధులు కేటాయింపు ఉందని మంత్రి ఓ ప్రక‌ట‌న‌లో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేస్తూ.. సంక్షేమానికి పెద్దపీట వేసేలా రాష్ట్ర బడ్జెట్‌ను ప్రభుత్వం రూపొందించిందని అన్నారు. ద‌ళిత బంధు ప‌థ‌కానికి గ‌తంలో క‌న్నా అధిక కేటాయింపులు చేస్తామ‌ని ఇచ్చిన హామీ మేర‌కు ఈ బడ్జెట్‌లో సీఎం కేసీఆర్.. భారీగా నిధులు కేటాయించార‌ని తెలిపారు. కేసీఆర్ దిశా నిర్దేశంతో అన్ని రంగాలకు, అన్ని వర్గాల ప్రజలకు ప్రాధాన్యతనిస్తూ ఆర్థిక మంత్రి హరీష్ రావు బడ్జెట్ రూపకల్పన చేయడం అభినందనీయమని తెలిపారు. అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో సైతం రూ. 2,56,958.51 కోట్లతో బడ్జెట్ ప్రతిపాదించడం కేసీఆర్‌కే సాధ్యమని అన్నారు.

పేద‌లు ఆత్మ గౌర‌వంతో బ‌త‌కాల‌నే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ డ‌బుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణ పథ‌కం ప్రవేశ పెట్టార‌ని.. దానికి అనుగుణంగా ఈ బడ్జెట్‌లో భారీగా రూ. 12 వేల కోట్ల నిధుల కేటాయించార‌ని మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి వెల్లడించారు. తాను నిర్వహిస్తున్న అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, దేవాదాయ‌ శాఖ‌ల‌కు బ‌డ్జెట్ కేటాయింపులు చేసినందుకు మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి సీఎం కేసీఆర్‌కు కృత‌జ్ఞత‌లు తెలిపారు.

అర్చకుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని హైద‌రాబాద్ ప‌రిధిలోని 1736 దేవాల‌యాల‌కు ధూప దీప నైవేథ్య ప‌థ‌కాన్ని కొత్తగా ఈ ఏడాది నుంచి అమ‌లు చేయ‌బోతున్నట్లు ప్రక‌టించ‌డం ప‌ట్ల మంత్రి హ‌ర్షం వ్యక్తం చేశారు. దానికి అనుగుణంగా ఈ బ‌డ్జెట్‌లో రూ.12.50 కోట్లు మంజూరు చేశార‌న్నారు. బ్రహ్మణుల‌ సంక్షేమానికి ఈ బ‌డ్జెట్‌లోనూ రూ. 177 కోట్లు కేటాయించార‌ని.. తెలంగాణ రాష్ట్రంలో అనేక ఆల‌యాల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించ‌డంతో పాటు వేద‌పండితులు, బ్రాహ్మణుల సంక్షేమం ప‌ట్ల సీఎం కేసీఆర్‌కు ఉన్న చిత్తశుద్ధికి ఇదే నిద‌ర్శన‌మ‌న్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా చేప‌ట్టిన తెలంగాణ‌కు హ‌రిత‌హారం కార్యక్రమానికి ఈ బ‌డ్జెట్ లో రూ. 932 కోట్లు ప్రతిపాదించార‌ని వెల్లడించారు.

Tags:    

Similar News