'మీడియాలో వచ్చిన వార్తల్లో నిజం లేదు.. కేసీఆర్ నాయకత్వంలో పార్టీని బలోపేతం చేస్తాం'
వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్కు టికెటివ్వొద్దంటూ నియోజకవర్గానికి చెందిన కొంతమంది నాయకులు
దిశ, వరంగల్ బ్యూరో: వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్కు టికెటివ్వొద్దంటూ నియోజకవర్గానికి చెందిన కొంతమంది నాయకులు మంత్రి ఎర్రబెల్లి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ వినోద్కుమార్ను కలిసినట్లుగా పార్టీ శ్రేణుల మధ్య జోరుగా చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో తామెవ్వరమూ అరూరి రమేష్కు వ్యతిరేకంగా పనిచేయడం లేదని, పనిచేయబోమని బీఆర్ఎస్ కీలక నేత, వరంగల్ డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు స్పష్టం చేశారు. ఇదే విషయంపై మీడియాలోనూ ప్రముఖంగా వార్తలు రావడంతో బీఆర్ఎస్ అధిష్ఠానం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం కొంతమంది నేతలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలిపించి మాట్లాడారు.
బుధవారం నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావుతో పాటు ఇతర నేతలతో చర్చించారు. అనంతరం మీడియాకు మార్నేని రవీందర్ రావు, ఎమ్మెల్యే పెద్దితో పాటు ఇతర నేతలున్న ఓ వీడియోను మీడియాకు రిలీజ్ చేశారు. అరూరి రమేష్కు తాము వ్యతిరేకం ఎంతమాత్రం కాదని వీడియోలో స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోనే పార్టీ బలోపేతానికి పనిచేస్తామని పేర్కొన్నారు. అరూరికి తమకు ఎలాంటి విబేధాల్లేవని పేర్కొన్నారు. పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా పార్టీలో విబేధాలు సృష్టించే ప్రయత్నం జరుగుతోందని తెలిపారు.