ఆకతాయిల ఆగడాలపై ప్రత్యేక నిఘా..
మహబూబాబాద్ జిల్లా పరిధిలో షీ టీమ్ బృందాలు అధికారుల

దిశ, మహబూబాబాద్ టౌన్ : మహబూబాబాద్ జిల్లా పరిధిలో షీ టీమ్ బృందాలు అధికారుల పర్యవేక్షణ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా పని చేస్తున్నాయని మహబూబాబాద్ జిల్లా ఐపీఎస్ సుధీర్ రాం నాథ్ కేకన్ గారు తెలిపారు. కళాశాలలు, పాఠశాలల్లో చదివే విద్యార్థినులు, మహిళలకు భద్రత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షీ టీమ్ లు ఆకతాయిలు ఆగడాలకు అడ్డుకట్ట వేస్తునాయని ఆయన అన్నారు.రద్దీ ప్రాంతంలో, బస్టాండ్లు, విద్యాసంస్థల , దేవాలయాలు పరిసర ప్రాంతాల్లో షీ టీమ్ పోలీసులు మఫ్టీలో ఉంటూ ఆకతాయిలకు చెక్ పెడుతున్నారు.మహబూబాబాద్,తొర్రూర్ సబ్ డివిజన్ పరిధిలలో షీ టీం పోలీసులు ఆ శాఖ పనితీరుపై బస్ స్టాండ్,రైల్వే స్టేషన్,ముఖ్య కూడళ్లలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అన్నారు. ప్రస్తుత తరుణంలో మహిళలు అన్ని రంగాల్లో పోటీపడి పనిచేస్తున్నారని తాము పనిచేస్తున్న రంగాల్లో ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్నారని, అలాంటి వారికి షి టీమ్స్ ఎల్లప్పుడూ అండగా నిలుస్తూ ధైర్యన్ని ఇస్తాయన్నారు.
అవగాహన కార్యక్రమాలు పెంచడం ద్వారా మారుమూల గ్రామీణ ప్రాంత మహిళలు, విద్యార్థినులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ధైర్యంగా ముందుకు వస్తారని షీ-టీమ్ చేపడుతున్న అవగాహన కార్యక్రమాలు ప్రజల ఆదరణ పొందుతున్నాయి అన్నారు.తమకు వచ్చిన ఫిర్యాదులను స్వీకరిస్తూ ఆకతాయిల ఆగడాలను వీడియో రికార్డ్ చేయడంతో పాటు కొన్ని సందర్భాల్లో కేసులు సైతం నమోదు చేస్తున్నారన్నారు. ఆకతాయిలు వెంటపడి వేధించడంతో పాటు అసభ్యకరంగా ప్రవర్తిస్తే 100, 112,తో పాటు 8712656935 వాట్సప్ నంబర్ లో సంప్రదించాలని , ఉన్నచోట నుంచి ఫిర్యాదు చేయడానికి qr.tspolice.gov.in వెబ్సైట్లోకి లాగిన్ అవ్వడం ద్వారా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.