డ్రగ్స్‌ ఫ్రీ కమిషనరేట్‌ మనందరి లక్ష్యంః సీపీ అంబర్ కిషోర్ ఝా

Update: 2024-08-18 10:46 GMT

దిశ, హనుమకొండ టౌన్ : యువత మత్తు పదార్థాలకు దూరంగా వుండాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సందీప్ కిషోర్ ఝా సూచించారు. యువతను మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా మత్తు పదార్థాల నిర్మూలణ కోసం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా వరంగల్‌ కమిషనరేట్‌ పోలీసుల అధ్వర్యంలో యువతకు 4కె పరుగును నిర్వహించడం జరిగింది. వరంగల్‌ కమిషనరేట్‌ పరిధిలోని కాలేజీలు, స్కూళ్లకు చెందిన విద్యార్థులతో పాటు స్థానిక యువతి, యువకులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌తో పాటు, వరంగల్‌, హనుమకొండ జిల్లా కలెక్టర్లు డా. సత్య శారద, ప్రావీణ్య, ఎన్‌పిడిసిఎల్‌ చైర్మన్‌ వరుణ్ రెడ్డితో పాటు జబర్‌దస్త్‌ ఫేం అదిరే అభి ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయము నుండి ప్రారంభమైన ఈ పరుగును అదాలత్‌ సెంటర్‌ వరకు తిరిగి అక్కడి నుండి పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌ వరకు కొనసాగింది. ఈ పరుగులో యువతి, యువకులకు విభాగాల్లో మొదటగా వచ్చిన ముగ్గురికి ముఖ్య అతిధుల చేతుల మీదుగా నగదు పురస్కారాలను అందజేశారు. సీపీ మాట్లాడుతూ.. మత్తు పదార్థాలు వినియోగించినా, విక్రయించినా నేరమవుతుందని, ఇలాంటి చర్యలకు పాల్పడేవారి సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత మనందరిపై వుందని, డ్రగ్స్‌ ఫ్రీ కమిషనరేట్‌ మనందరి లక్ష్యమని తెలిపారు. వరంగల్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ.. మత్తుపదార్థాలకు దూరం వుండాలని, మీ భవిష్యత్తు కోసం నిత్యం శ్రమించే మీ కుటుంబ సభ్యులను దృష్టిలో వుంచుకుని మత్తుకు పదార్థాలకు బానిసలు కావద్దని తెలిపారు. మత్తు పదార్థాలను సేవించే వారిని తక్కువ చేసి చూడకుండా వారిని చేరదీసి మత్తు పదార్థాల నుండి దూరం చేసేందుకు మనమందరం ప్రయత్నించాలని హనుమకొండ కలెక్టర్‌ తెలిపారు. ఎన్‌పిడిసిఎల్‌ చైర్మన్‌ మాట్లాడుతూ.. మత్తు పదార్థాలకు అలవాటు పడి మీ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని కోరారు. ఈ కార్యక్రమములో డిసిపిలు రవీందర్‌, రాజమహేంద్ర నాయక్‌, అదనపు డిసిపిలు రవి, సంజీవ్‌, సురేష్‌కుమార్‌ తో పాటు ఏసిపిలు, ఇన్స్‌స్పెక్టర్లు, ఆర్‌.ఐలు, ఎస్‌.ఐ, ఆర్‌.ఎస్‌.ఐలు, పోలీస్‌ జాగృతి కళాబృందంతో పాటు ఇతర పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Tags:    

Similar News