వీసీ పోస్టులకు పైరవీలు స్టార్ట్.. మినిస్టర్స్ నుంచి CMOకు లెటర్స్

వీసీ పోస్టు కోసం పెద్ద ఎత్తున రికమండేషన్ లెటర్లు వచ్చినట్టు తెలుస్తున్నది.

Update: 2024-07-15 02:32 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: వీసీ పోస్టు కోసం పెద్ద ఎత్తున రికమండేషన్ లెటర్లు వచ్చినట్టు తెలుస్తున్నది. మంత్రుల సిఫారుసులు, పైరవీల వల్లే వర్సిటీ వీసీల నియామకానికి బ్రేకులు పడ్డాయని ప్రచారం జరుగుతున్నది. రాజకీయ జోక్యం లేకుండా, కేవలం సమర్థులైన విద్యావేత్తలను మాత్రమే వైస్ చాన్స్‌లర్లుగా నియమించాలని సీఎం రేవంత్ భావించారు. అందుకోసం విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదల చేసి, దరఖాస్తులను స్వీకరించింది. కానీ, మంత్రులు తమ సన్నిహితులకు వీసీ పదవులు ఇవ్వాలని పేచీ పెట్టినట్టు తెలుస్తున్నది. ఈ వివాదం అధిష్ఠానం వద్దకు చేరడంతో సదరు మంత్రులకు త్వరలో ఢిల్లీ పెద్దలు కౌన్సెలింగ్ ఇచ్చే చాన్స్ ఉందని సమాచారం.

ఒక్కొ మంత్రి ముగ్గురికి లేఖలు

విద్యాశాఖ పరిధిలోని 10 వర్సిటీల వైస్ చాన్స్‌లర్ల పోస్టుల కోసం సుమారు 1,400 మంది ప్రొఫెసర్లు దరఖాస్తు చేసుకున్నారు. ఆ అప్లికేషన్లను పరిశీలించి, అర్హులైన వారిని ఎంపిక చేసేందుకు ప్రభుత్వం సెర్చ్ కమిటీల మీటింగ్‌కు ప్లాన్ చేస్తున్న సమయంలో మెజార్టీ మంత్రులు తమ వాళ్లకు వీసీ ఇవ్వాలంటూ సీఎంవోకు సిఫారసు లెటర్లు పంపినట్టు ప్రచారం జరుగుతున్నది. ఒక్కో మంత్రి ఇద్దరు ముగ్గురు ప్రొఫెసర్లకు సిఫారసు లెటర్లు ఇచ్చినట్టు టాక్ నడుస్తున్నది. కొందరు మంత్రులు తమ వర్గం వారికి తప్పకుండా ప్రయారిటీ ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు తెలుస్తున్నది. దీంతో మంత్రుల తీరును సీఎం రేవంత్ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తున్నది.

సమర్థులకు ఇవ్వాలని సీఎం పట్టు

బీఆర్ఎస్ ప్రభుత్వంలో పొలిటికల్ లీడర్ల ఆశీస్సులతోనే వీసీ పదవుల పంపిణీ జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. ఆ కారణంగా వర్సిటీల్లో నాణ్యమైన విద్యాబోధన జరగలేదని విమర్శలు వచ్చాయి. ఆ అనుభవాలను దృష్టిలో పెట్టుకున్న సీఎం రేవంత్ వీసీల నియామకం విషయంలో ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా భర్తీ చేయాలని భావించారు. సమర్థతతో పాటు సామాజిక న్యాయం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటామని ప్రకటించారు. అందులో భాగంగా వీసీల పదవీ కాలం ముగిసే లోపు కొత్త వీసీలను అపాయింట్ చేయాలని, అందుకోసం కావాల్సిన ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశించారు.

దీనితో పార్లమెంటు ఎన్నికల సమయంలోనే ఈసీ నుంచి ప్రత్యేకంగా అనుమతి తీసుకుని వీసీల నియామకం కోసం దరఖాస్తులు తీసుకున్నారు. వచ్చిన అప్లికేషన్లను స్క్రూటినీ చేసి, సెర్చ్ కమిటీలు ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వంలో అపాయింట్ అయిన వీసీల పదవి కాలం మే 21న ముగిసింది. ఈ నెల చివరిలోపు లేదా అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే సెర్చ్ కమిటీలతో సమావేశం నిర్వహించే చాన్స్ ఉందని తెలుస్తున్నది. సెర్చ్ కమిటీ ఒక్కో వర్సిటీకి ముగ్గురు పేర్లను ఫైనల్ చేసి, రాజ్ భవన్‌కు పంపితే అందులో ఒకరిని గవర్నర్ వీసీగా నియమించనున్నారు.

Tags:    

Similar News